దేశవ్యాప్తంగా భారీ ఎత్తున బయటపడిన నకిలీ జీఎస్టీ ఇన్వాయిస్ల కేసుల్లో.. ఇప్పటి వరకు 215 మందిని అరెస్టు చేశారు జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు. మొత్తం 2,200 కేసులు నమోదయ్యాయి. మోసాలకు పాల్పడిన వారి నుంచి గత రెండు నెలల్లో రూ.700 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు 'ఈటీవీ భారత్' పరిశీలనలో తెలిసింది.
జీఎస్టీ అధికారులు అరెస్ట్ చేసిన వారిలో.. ఆరుగురు ఛార్టెడ్ అకౌంటెంట్లు (సీఏ), ముగ్గురు సీఈఓలు, 36 మంది ఎండీలు, డైరెక్టర్లు, 15 మంది పార్టనర్లు, 81 మంది ప్రొప్రైటర్లు సహా ఇతరులు ఉన్నట్లు రెవెన్యూ వర్గాల ద్వారా తెలిసింది. వీరంతా నకిలీ జీఎస్టీ బిల్లులను సృష్టించి.. అక్రమంగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను క్లెయిమ్ చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులకు సంబంధించి మొత్తం 6,600 జీఎస్టీ నంబర్లను రద్దు చేశారు.
బోగస్ జీఎస్టీ డీలర్లతో పాటు.. నకిలీ బిల్లులతో లబ్ధిపొందిన తుది వ్యక్తి వరకు అరెస్టయిన వారిలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
'బీఏఎఫ్టీఏ టూల్స్తో పాటు డేటా అనలటిక్స్, డేటా షేరింగ్, కృత్రిమ మేధ వంటి సాంకేతికతలను ఉపయోగించి.. నకిలీ సంస్థల కార్యకలాపాలను గుర్తించాం' అని అధికారులు 'ఈటీవీ భారత్'కు వివరించారు.
సూత్రధారుల్లో ఎమ్మెల్యే కుమారుడు..
జీఎస్టీ మోసాలకు సంబంధించి 70 మందికిపైగా సూత్రధారులనూ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అందులో కుటుంబ సభ్యుల పేర్లతో నకిలీ సంస్థలు ఏర్పాటు చేసి మోసానికి పాల్పడిన చెన్నైకి చెందిన మహిళ సహా.. మహారాష్ట్రకు చెందిన ఓ ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్నట్లు అధికారులు వివరించారు.
ముంబయిదే అగ్రస్థానం..
నకిలీ జీఎస్టీ ఇన్వాయిస్ల కేసులో ముంబయి జోన్లోనే అత్యధికంగా 23 మంది అరెస్టయినట్లు అధికారులు తెలిపారు. 14 మందితో అహ్మదాబాద్ జోన్ రెండో స్థానంలో ఉంది.
మోసాలకు పాల్పడ్డ కంపెనీల్లో ఎక్కువ మొత్తం గార్మెంట్స్, కాపర్ స్క్రాప్, ఔషధాలు, ఐరన్ స్క్రాప్, సిమెంట్, బొగ్గు వంటి వ్యాపారాలకు సంబంధించినవని గుర్తించారు అధికారులు.
ఇదీ చూడండి:మొండిబాకీలతో బ్యాంకులకు బేజారు