ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) రూపొందించిన యంగ్ గ్లోబల్ లీడర్స్ జాబితాలో ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకునె స్థానం సంపాదించారు. అత్యంత ప్రభావశీలురైన రేపటి తరం నాయకులుగా డబ్ల్యూఈఎఫ్ 112మందిని ప్రకటించింది. ఇందులో పలువురు భారతీయులతో పాటు భారత సంతతికి చెందిన వాళ్లు కూడా ఉన్నారు. వీరంతా ఆయా రంగాల్లో విశేష కృషి చేసిన వారని డబ్ల్యూఈఎఫ్ కొనియాడింది. వీరంతా ప్రజారోగ్యం, వైద్య పరిశోధన కార్యక్రమాల్లో పాల్గొంటున్న వారేనని గుర్తు చేసింది.
ఇప్పటివరకు 120 దేశాల నుంచి 1,400 మందిని యంగ్ గ్లోబల్ లీడర్స్గా ప్రకటించిన డబ్ల్యూఈఎఫ్... వారిలో ప్రధాన మంత్రులు జసిందా ఆర్డెర్న్, సన్నా మారిన్, కోస్టా రికా అధ్యక్షుడు కార్లోస్ అల్వరాడో క్యూసాడా, నటుడు యావో చెన్, న్యాయవాది అమల్ క్లూనీ, చిత్ర నిర్మాత వనూరి కహియు కూడా ఉన్నట్లు తెలిపింది.
గతేడాదిలో వీరంతా కరోనాకు సంబంధించిన 30 కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు చెప్పుకొచ్చింది. తాజాగా ప్రకటించిన జాబితాలో 56 దేశాలకు చెందిన ప్రతినిధులు ఉన్నారని.. వారంతా లింగ సమానత్వంపై చేపట్టే అవగాహనా కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొంది.
విద్యా, పరిశోధనాల్లో యంగ్ లీడర్లు వీరే...
- దేవి శ్రీధర్ (గ్లోబల్ హెల్త్ పాలిటిక్స్ విశ్వవిద్యాలయ లెక్చరర్, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, యూకే)
- అడ్రియానా కార్గిల్ (జర్నలిస్ట్, అమెరికా)
- మష్రాఫ్ బిన్ మోర్తాజా (బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కెప్టెన్)
- రోహన్ రామకృష్ణన్ (ఆసియన్ పోస్ట్ వ్యవస్థాపకుడు, సీఈఓ, మలేషియా)
వ్యాపార రంగంలో...
- నిర్వాణ చౌదరి( చౌదరి గ్రూప్ ఎండీ, నేపాల్)
- శ్రీవర్ ఖేరుకా(బోరోసిల్ ఇండియా ఎండీ,సీఈఓ)
- శ్రీకాంత్ బొల్లా(బోలంట్ ఇండస్ట్రీస్, సీఈఓ)
సామాజిక రంగంలో...
- అమిత్ పాలే (ది ట్రెవర్ ప్రాజెక్ట్, సీఈఓ, అమెరికా)
- అనులిక అజుఫో (సోరోస్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఫండ్ ప్రిన్సిపాల్, యూకే)
- దీపికా పదుకొనే (లైవ్ లవ్ లాఫ్ ఫౌండేషన్, భారత్)