స్టాక్ మార్కెట్లో మదుపు చేసే మదుపర్ల ముఖ్యమైన సమాచారాన్ని భద్రపరిచే 'సీడీఎస్ఎల్ వెంచర్స్ లిమిటెడ్'లో కీలక లోపం (Data breach cdsl) వెలుగు చూసింది. సమాచార నిల్వ సాంకేతికతలోని ఈ లోపం వల్ల 4.3 కోట్ల మంది మదుపర్ల కీలక వివరాలు బహిర్గతమయినట్లు (Data breach news) సైబర్ భద్రత కన్సల్టెన్సీ అంకుర సంస్థ సైబర్ఎక్స్9 వెల్లడించింది. 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు ఇలా జరిగినట్లు పేర్కొంది.
సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్(సీడీఎస్ఎల్) సెబీ నమోదిత సంస్థ. స్టాక్ మార్కెట్లో మదుపు చేసేవారి వివరాలతో పాటు వారి ఖాతాలో ఉన్న షేర్ల వివరాలను ఇది నిర్వహిస్తుంది. దీని అనుబంధ సంస్థే సీడీఎస్ఎల్ వెంచర్స్ లిమిటెడ్. సెబీ వద్ద నమోదైన ఈ సంస్థ.. మదుపర్ల కేవైసీ వివరాలను భద్రపరుస్తుంది. అక్టోబరు 19న లోపాన్ని గుర్తించి విషయాన్ని సీడీఎస్ఎల్కు నివేదించినట్లు సైబర్ఎక్స్9 తెలిపింది. వెంటనే సమస్యను పరిష్కరించే అవకాశం ఉన్నప్పటికీ.. దాదాపు వారం రోజుల తర్వాత గానీ లోపాన్ని సవరించలేకపోయారని పేర్కొంది. తిరిగి అక్టోబరు 29న కూడా మరోసారి లోపాన్ని గుర్తించామని తెలిపింది. తొలిసారి గుర్తించిన సమస్యను సవరించేందుకు తీసుకున్న చర్యల్లోనూ లోపాలున్నట్లు తేలింది. ప్రస్తుతానికి దాన్ని పరిష్కరించినట్లు పేర్కొంది. ఈ లోపాల వల్ల మదుపర్ల పేర్లు, ఫోన్ నెంబర్లు, ఈ-మెయిల్ ఐడీ, పాన్, వార్షికాదాయం, పుట్టిన తేదీ, తండ్రి పేరు వంటి వ్యక్తిగత విషయాలు బహిర్గతమైనట్లు వెల్లడించింది. ఆర్థిక మోసాలకు పాల్పడేందుకు సైబర్ నేరగాళ్లకు ఈ సమాచారం చాలని సైబర్ఎక్స్9 తెలిపింది.
దీనిపై స్పందించిన సీడీఎస్ఎల్.. మదుపర్ల సమాచారానికి ఎలాంటి ముప్పు లేదని తెలిపింది. సీడీఎస్ఎల్ వెంచర్స్లో చిన్న లోపం తమ దృష్టికి రాగానే వెంటనే పరిష్కరించామని పేర్కొంది.
ఇదీ చదవండి:15 రోజుల ట్రయల్ ఆఫర్తో స్మార్ట్ఫోన్.. నచ్చితే కంటిన్యూ.. లేదంటే రిటర్న్!