2016లో మోదీ ప్రభుత్వం నోట్ల రద్దు చేసిన నాటి నుంచి గృహ నిర్మాణ రంగంలో నగదు లావాదేవీలు 75 నుంచి 80 శాతం వరకు తగ్గినట్లు ప్రముఖ హౌసింగ్ బ్రోకరేజ్ సంస్థ అనరాక్ తెలిపింది. ఈ రంగంలో నల్లధనం ప్రవాహం భారీగా తగ్గినట్లు పేర్కొంది. దేశంలోని ఏడు ప్రధాననగరాల్లో బ్యాంకుల హోంలోన్, రిజిస్ట్రేషన్, డాక్యుమెంటేషన్ లాంటి వాటిపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని వెల్లడించింది. సుమారు 1,500 కంటే ఎక్కువ సేల్స్ ఏజెంట్ల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా దీనిని రూపొందించినట్లు పేర్కొంది.
గృహ నిర్మాణ రంగంలో హోమ్లోన్స్ తీసుకునే వారి సంఖ్య భారీగా పెరిగినట్లు అనరాక్ తెలిపింది. ఈ సమాచారం రీసేల్ రెసిడెన్షియల్ మార్కెట్ నుంచి కాకుండా డెవలపర్లు అమ్మకాల నుంచి సేకరిచిందని సంస్థ స్పష్టం చేసింది. ఒకప్పటిలాగా భారతీయ గృహనిర్మాణరంగంలో నగదు ప్రవాహం ఎక్కువగా ఉండేదని.. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదని అనరాక్ ఛైర్మన్ అనుజ్ పూరి తెలిపారు. గతంలో లాగా ప్రజలు బ్లాక్మనీతో గృహ రంగంలో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య తగ్గిందని చెప్పారు. ప్రస్తుతం సొంతింటి కలలను నెరవేర్చుకోవాలి అనుకునే వారు పారదర్శకంగా కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే, చిన్న పట్టణాలల్లో ఇంకా బ్లాక్మనీ కొనుగోళ్లు నిర్వహించేవారు ఉన్నట్లు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: క్రిప్టోతో తీవ్ర సమస్యలే: ఆర్బీఐ గవర్నర్