విద్యుత్ వాహన వినియోగదారులకు తమ వాహనాలకు ఛార్జింగ్ పెట్టడం అనేది ఓ పెద్ద సమస్య. దానికోసం గంటలపాటు సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. అయితే.. బెంగళూరుకు చెందిన ఓ అంకుర పరిశ్రమ ఈ సమస్యకు ఓ చక్కటి పరిష్కారంతో ముందుకు వచ్చింది. ఎలాంటి విద్యుత్ వాహనానికైనా తాము తయారు చేసిన బ్యాటరీని అమర్చితే.. కేవలం 15 నిమిషాల్లోనే పూర్తి ఛార్జింగ్ చేసుకోవచ్చని చెబుతోంది.

అరుణ్ వినాయక్, సంజయ్ బైలా కలసి బెంగళూరు కేంద్రంగా ఎక్స్పోనెంట్ ఎనర్జీ అంకుర సంస్థను ఏర్పాటు చేశారు. ఇ-ప్యాక్, ఇ-పంప్ పేరుతో బ్యాటరీ ప్యాక్, ఛార్జింగ్ స్టేషన్ను వారు అభివృద్ధి చేశారు. ఈ బ్యాటరీలను అమర్చుకున్న ఎలాంటి వాహనమైనా కేవలం 15 నిమిషాల్లోనే పూర్తి స్థాయి ఛార్జింగ్ అవుతుందని.. ఎనర్జీ ఎక్స్పోనెంట్ వ్యవస్థాపకుల్లో ఒకరైన అరుణ్ వినాయక్ చెబుతున్నారు.

"బ్యాటరీ పరిస్థితిని బట్టి ఛార్జర్ విద్యుత్తు ప్రసారాన్ని నియంత్రిస్తూ ఉంటుంది. ఫలితంగా బ్యాటరీకి జరిగే నష్టాలను నివారిస్తూనే తక్కువ సమయంలో ఎక్కువ విద్యుత్ను నింపేందుకు అవకాశం ఉంటుంది. అందుకే ఎలాంటి వాహనానికైనా మా బ్యాటరీని అమర్చితే 15 నిమిషాల్లోనే ఛార్జ్ చేయొచ్చు."
-అరుణ్ వినాయక్, ఎక్స్పోనెంట్ ఎనర్జీ వ్యవస్థాపకుడు
ఈ బ్యాటరీలను 2022 జనవరి నాటికి పూర్తి స్థాయి వినియోగానికి అందుబాటులోకి తీసుకువస్తామని అరుణ్ వినాయక్ చెప్పారు. దీని ద్వారా దేశంలో విద్యుత్ వాహనాల వినియోగం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: లాకర్ను ఉపయోగిస్తున్నారా?.. అయితే ఇవి తెలుసుకోండి!
ఇదీ చూడండి: పండగ సమయంలో కొలువుల జాతర