World Most Expensive Mango : బంగాల్లోని సిలిగుడి జిల్లా మటిగరా మాల్లో.. 7వ ఎడిషన్ మ్యాంగో ఫెస్టివల్ జరుగుతోంది. మొడెల్లా కేర్ టేకర్ సెంటర్ స్కూల్ నిర్వహిస్తున్న ఈ ఫెస్టివల్కు 262 రకాల మామిడిపండ్లు ప్రదర్శనకు వచ్చాయి. వాటిలో మియాజాకి రకం మామిడిని చూసేందుకు జనం ఆసక్తి కనబరిచారు. వీటి ధర కిలో 2.75 లక్షలు కావడం వల్ల కొనేందుకు కాకపోయినా చూసేందుకు వచ్చామని పలువురు అంటున్నారు. ఈ ఫెస్టివల్ జూన్ 9 నుంచి మూడు రోజుల పాటు జరగనుంది.

Most Expensive Mango India : మియాజాకి రకం మామిడి పండ్లు భారత్ సహా పలు ఆసియా దేశాల్లో సాగుచేస్తారు. ముందుగా జపాన్లోని మియాజాకి నగరంలో.. ఈ రకం మామిడి చెట్లు బయటపడ్డాయి. పరిమాణంలో సాధారణ మామిడి పండ్ల కంటే పెద్దగా ఉంటాయి. ఒక్కో పండు.. 350 గ్రాముల నుంచి 900 గ్రాముల వరకు బరువు పెరుగుతాయి. వీటిలో.. ఇతర రకాలతో పోలిస్తే.. తీపి 15 శాతం ఎక్కువగా ఉంటుంది. ఏటా ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో వచ్చే ఈ పండ్లు పక్వానికి వచ్చినప్పుడు.. లేత ఎరుపు రంగులో ఉంటాయి. భారత్లో బంగాల్, మధ్యప్రదేశ్లో కొందరు రైతులు ఈ పండ్లను సాగు చేస్తున్నారు.

మియాజాకి రకం మామిడిపండ్లపై నెటిజన్లు సరదా ట్వీట్లు చేస్తున్నారు. కొందరైతే బంగారం కంటే ఖరీదైన ఈ పండ్లను సాగు చేసి.. అధిక మొత్తంలో డబ్బు సంపాదిస్తామని ట్వీట్ చేశారు. మరికొందరు ఎగ్జిబిషన్కు తెచ్చిన పండ్లకు రక్షణ కల్పించండి.. లేదంటే ఎవరైనా ఎత్తుకెళ్లగలరని కామెంట్లు చేశారు.

మామిడి కిలో రూ. 2.70 లక్షలు.. 15 కుక్కలతో పహారా!
ఈ మియాజాకి జాతికి చెందిన మామిడి పండ్లను మధ్యప్రదేశ్ జబల్పుర్లో గతేడాది ఏప్రిల్లో ఓ రైతు సాగు చేశాడు. దాంతో పాటు 28 రకాల దేశ విదేశాలకు చెందిన మామిడి పండ్లను పండించారు. ఇందులో అత్యంత ఖరీదైన వెరైటీలు కూడా ఉన్నాయి. అయితే కిలో రూ. 2.70 లక్షలు పలుతున్న ఆ పండ్లకు పటిష్ఠ రక్షణ ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఏకంగా 15 శునకాలు మోహరించారు. నిరంతరం తోట పహారా కోసం నలుగురు సిబ్బందిని నియమించారు. మామిడి కాయలు చోరీకి గురికాకుండా ఉండేందుకు నలుగురు సిబ్బంది 24 గంటలపాటు డేగ కళ్లతో చూస్తుంటారు. అంతేకాకుండా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే, మియాజాకి మామిడి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రకం అని.. జపాన్లోని మియాజాకి రాష్ట్రంలో పండే ఈ రకానికి ఆ ప్రాంతం వల్లే ఈ పేరు వచ్చినట్లు చెప్పారు రైతు వెళ్లడించారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.