బంగాల్ పంచాయతీ ఎన్నికల్లో 53 ఏళ్లుగా గెలుస్తున్న ఓ వ్యక్తి.. 88 ఏళ్ల వయసులోనూ మరోసారి పోటీకి సిద్ధమయ్యారు. తననూ ఎవరూ ఓడించలేరని సవాల్ కూడా విసురుతున్నారు. వృద్ధాప్యంలోనూ నవ యువకుడిలా ప్రచారాన్ని హోరెత్తించారు. ప్రస్తుతం జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో ఆ వృద్ధుడికి తృణమూల్ కాంగ్రెస్ మరోసారి టికెట్ ఖరారు చేసింది. ఆయనే మెదినీపుర్ జిల్లా నందనపుర్-2 గ్రామ పంచాయతీకి చెందిన గోపాల్చంద్ర నంది.
గోపాల్చంద్ర నంది 1965లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ తరఫున పంచాయతీ ఎన్నికల్లో బరిలో దిగి గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పలుసార్లు విజయం సాధించారు. కొన్నాళ్ల క్రితం.. కాంగ్రెస్ను వీడి తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. పార్టీ మారినా.. ఆయన విజయపరంపర ఆగలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్, వామపక్ష పార్టీలు అధికారంలో ఉన్న సమయంలోనూ ఆయన విజయఢంకా మోగించారు. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా విజయ పరంపర కొనసాగించారు. గోపాల్చంద్ర చివరగా.. పశ్చిమ మెదినీపుర్లోని దాస్పుర్-1 బ్లాక్లోని నందనపూర్-2 గ్రామ పంచాయతీ గోవిందనగర్ గ్రామం నుంచి గెలుపొందారు. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా గోవిందనగర్ వెస్ట్ బూత్ నుంచి పోటీ చేస్తున్నారు.
![undeafeted Gopalchandra Nandi in Panchayat Polls](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/wb-wmid-01-daspur-old-prarthi-gopal-vis-wb10035_15062023133630_1506f_1686816390_935_1506newsroom_1686847716_283.jpg)
1965 నుంచి 2018 వరకు.. దాదాపు 53 సంవత్సరాలు అప్రతిహతంగా విజయం సాధించిన గోపాల్ చంద్ర.. ఆ సమయంలో కొన్నిసార్లు గ్రామ పంచాయతీలో, కొన్నిసార్లు పంచాయతీ సమితి ఎన్నికలలో పోటీ చేశారు. కొన్నాళ్లు పంచాయతీ సర్పంచ్గా బాధ్యతలు కూడా నిర్వర్తించారు. 1965 నుంచి 1978 వరకు నందనపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఉన్నారు. వరుసగా 25 ఏళ్లు పంచాయతీ సభ్యుడిగా ఉన్నందుకు గుర్తింపుగా 2009లో కేంద్ర ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్ కూడా పొందారు గోపాల్చంద్ర.
గోపాల్చంద్ర నంది.. పార్టీలకు అతీతంగా అభిమానాన్ని పొందారని.. అందుకే ఓటర్లు ప్రతిసారీ అయనను విశ్వసిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. గోపాల్ చంద్ర.. స్థానికంగా నిజాయితీపరుడిగా పేరు తెచ్చుకున్నారని అందరితో మంచిగా ఉంటారని స్థానికుడు అసిత్ ఘోష్ తెలిపారు. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరితో మంచిగా మాట్లాడతారని.. వృద్ధాప్యంలో కూడా ప్రశాంతంగా, నాగరికత తెలిసిన వ్యక్తిలా హూందాగా పోరాడుతున్నారని కొనియాడారు.
![undeafeted Gopalchandra Nandi in Panchayat Polls](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/wb-wmid-01-daspur-old-prarthi-gopal-vis-wb10035_15062023133630_1506f_1686816390_988_1506newsroom_1686847716_772.jpg)
"నేను బాబా (తండ్రి) హరిపాడ్ నందితో కలిసి గాంధీజీ చేపట్టిన క్విట్ ఇండియా ఉద్యమంలో చేరాను. రాజకీయాల్లో బిధాన్ చంద్ర రాయ్, అజయ్ ముఖోపాధ్యాయతో సన్నిహితంగా మెలిగాను. నేను ఎప్పుడూ ప్రజల పక్షాన పని చేయడానికి ప్రయత్నిస్తాను. ప్రజలు కూడా నన్ను ప్రేమిస్తారు. నేను నా జీవితంలో ఎప్పుడూ ఎన్నికల్లో ఓడిపోలేదు. ఈసారి కూడా ఓడిపోను. అందరితో కలిసి పనిచేయడానికి ప్రయత్నిస్తాను"
-- గోపాల్చంద్ర నంది
గోపాల్చంద్ర నంది నజాయితీపరుడని దాస్పూర్-1 బ్లాక్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుకుమార్ పాత్ర అన్నారు. 'గోపాల్చంద్ర నంది 1965 నుంచి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉన్నారు. అయినా ఓడిపోలేదు. అందుకే పార్టీ ఈసారి కూడా ఆయనకే టికెట్ ఖరారు చేసింది' అని గోపాల్చంద్రను సుకుమార్ కొనియాడారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యదర్శి అభిషేక్ బెనర్జీ 'తృణమూల్ నబో జోర్' కార్యక్రమానికి భాగంగా.. గోపాల్ చంద్రతో విడివిడిగా మాట్లాడారు.