ఛత్తీస్గఢ్ అధికార పార్టీలో మళ్లీ రాజకీయ రగడ మొదలైనట్లు తెలుస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్, ఆరోగ్య మంత్రి టీఎస్ సింగ్ దేవ్ల మధ్య విభేదాలున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో.. సీఎం పీఠంపై మళ్లీ అనిశ్చితి నెలకొంది.
ఇటీవల మీడియాతో మాట్లాడిన బఘేల్ సీఎం పదవి తాత్కాలికమని, ఆ విషయంపై పార్టీ సభ్యులు నిర్ణయం తీసుకుంటారని అన్నారు.
"నాకు ముఖ్యమంత్రి పదవిపై వ్యామోహం లేదు. నేను ప్రజల కోసం పని చేయాలనుకుంటున్నాను. కొంత మందికి నాతో, రాష్ట్ర అభివృద్ధి విషయంలో సమస్యలున్నాయని తెలుసు. ఒకవేళ అధిష్ఠానం ఆదేశిస్తే.. వెంటనే నేను రాజీనామా చేస్తా."
- భూపేశ్ బఘేల్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి
పార్టీలో కీలక నేత అయిన టీఎస్ సింగ్ దేవ్ చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా.. విభేదాలపై వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరుతోంది.
రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. రెండున్నరేళ్లపాటు టీఎస్ సింగ్ దేవ్కు ముఖ్యమంత్రి పదవీ ఇచ్చేందుకు ఒప్పందం కుదిరిందనే విషయం చాలా మంది నమ్ముతున్నారు.
అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిన తర్వాత.. రాహుల్ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో బఘేల్-సింగ్ దేవ్ల మధ్య విభేదాలు కూడా పెరుగుతున్నట్లు తెలిసింది.
కొన్ని రోజుల క్రితం 'ఈటీవీ భారత్'తో మాట్లాడిన టీఎస్ సింగ్ 2.5 ఫార్ములా అంశాన్ని ప్రస్తావించారు. ఏ ముఖ్యమంత్రికి కూడా కచ్చితమైన పదవీ కాలం ఉండదని, రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదని వివరించారు.
'ఆర్జున్ సింగ్ను రెండు రోజుల ముఖ్యమంత్రిగా, 15 ఏళ్లు సుదీర్ఘ సీఎంగానూ చూశాం. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిపై పార్టీ అధిష్ఠానం.. పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటుంద'ని అన్నారు.
ఇదీ చూడండి:కేంద్రం చర్యలు రాజ్యాంగవిరుద్ధం: టీఎంసీ