బంగాల్లో మమతా బెనర్జీ, సువేందు అధికారి పోటీలో ఉన్న నందిగ్రామ్లో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. తప్పుడు వివరాలతో నామినేషన్లు దాఖలు చేశారంటూ ఇరు పార్టీలూ ఎన్నికల సంఘాని(ఈసీ)కి పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. మమతా బెనర్జీ ఆరు క్రిమినల్ కేసులు దాచి పెట్టారంటూ సువేందు అధికారి కేంద్ర ఎన్నికల సంఘానికి ఇటీవల ఫిర్యాదు చేశారు. తాజాగా తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతలు ఆయనపై లేఖ రాశారు. నందిగ్రామ్ నుంచి బరిలో ఉన్న సువేందు నామినేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
సువేందుకు నందిగ్రామ్, హాల్దియా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓట్లు ఉన్నాయని.. దీన్ని ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 17 అనుమతించదని టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ పేర్కొన్నారు. ఈ సెక్షన్ ప్రకారం అభ్యర్థి ఒకేచోట ఓటరుగా ఉండాలని తెలిపారు. సువేందు హాల్దియా నుంచి నందిగ్రామ్కు ఓటు మార్చుకొనేందుకు మైగ్రేషన్ దరఖాస్తు చేసినప్పటికీ.. అందులో నివాసానికి సంబంధించి నకిలీ వివరాలు సమర్పించారని ఆరోపించారు. నందిగ్రామ్లోని నందనాయక్బార్లో నివాసం ఉంటున్నట్టు పేర్కొన్నప్పటికీ బీఎల్వో వెరిఫికేషన్కు వెళ్లినప్పుడు ఆయన అక్కడ లేరనేందుకు ఆధారాలు ఉన్నాయన్నారు. ఆయన గత ఆరు నెలల నుంచి అక్కడ నివాసం ఉండటంలేదని లేఖలో పేర్కొన్నారు టీఎంసీ నేతలు.
ఇదీ చదవండి: బంగాల్ దంగల్: కీలక స్థానాల్లో జంప్జిలానీల పాగా!