రోగ నిరోధక శక్తిని పెంచే మందంటూ నకిలీ మాత్రలను పంచి.. ఒకే కుటుంబంలోని ముగ్గురి ప్రాణాలను బలిగొన్నాడు ఓ కిరాతకుడు. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో జరిగిందీ ఘటన. అయితే.. అధికారులు దర్యాప్తులో ఓ పెద్ద కుట్రకోణం బయటపడింది.
అసలేమైందంటే..
ఈరోడ్ జిల్లా కారుగౌండన్ వాలసు గ్రామానికి చెందిన కారుప్పన్నన్ అనే రైతు ఇంటికి ఆరోగ్య కార్యకర్తనని చెబుతూ మారువేషంలో ఓ వ్యక్తి శనివారం ఉదయం వచ్చాడు. జ్వరం గానీ, దగ్గుగానీ ఉన్నాయా అని వారిని ఆరా తీశాడు. అయితే.. వారు మాత్రం తమకు అలాంటివేమీ లేవని సమాధానమిచ్చారు. అయినప్పటికీ.. రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, కరోనా రాకుండా ఉంటుందని చెబుతూ కొన్ని మాత్రలను ఆ కుటుంబానికి ఇచ్చాడతడు.
అతడు వెళ్లిన తర్వాత కారుప్పన్నన్ సహా అతని భార్య, అతని ఇంట్లో పని చేసే మరో వ్యక్తి ఆ మందులను తీసుకున్నారు. దాంతో వారు స్పృహ కోల్పోయారని పోలీసులు చెప్పారు. కారుప్పన్ భార్య మల్లిక అదేరోజు ప్రాణాలు కోల్పోయిందని వెల్లడించారు. ఆదివారం కారుప్పన్నన్ కుమార్తె, పనిమనిషి మృతి చెందారని తెలిపారు. కారుప్పన్నన్ పరిస్థితి విషమించగా.. ఆస్పత్రిలో చికిత్స పొందతున్నారని పేర్కొన్నారు.
ప్లాన్ చేసి...
ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. దర్యాప్తులో భాగంగా ఇద్దరు వ్యక్తులను ఆదివారం అరెస్టు చేశారు. అయితే.. కారుప్పన్నన్కు మరో వ్యక్తికి మధ్య ఏర్పడిన భూవివాదమే అతని కుటుంబ సభ్యుల హత్యకు కారణమని అధికారులు గుర్తించారు.
కారుప్పన్నన్ భూమిని కొనుగోలు చేసిన నిందితుడు చాలా కాలం నుంచి అతడికి డబ్బులు ఇచ్చేందుకు నిరాకరిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో కారుప్పన్నన్ను హత్య చేస్తే డబ్బులు ఇచ్చే బాధ తప్పుతుందని భావించి అతడి కుటుంబాన్ని అంతమొందించాలని కుట్ర పన్నాడని పోలీసులు తెలిపారు. అందులో భాగంగా ఈ నకిలీ ఆరోగ్య అధికారిని పంపించి.. విషపూరిత మాత్రలు అందజేశాడని చెప్పారు.
నిందితులను మేజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరచగా.. వారికి 15 రోజుల జుడీషియల్ కస్టడీ విధించారు.
ఇదీ చూడండి: Live Video: యువకుడ్ని గుద్ది చంపిన ఎద్దు
ఇదీ చూడండి: Live Video: బైక్లో దూరిన పాముపై కర్కశత్వం