మంచుప్రాంత చేప.. అత్యంత అరుదైన రకం చేప ఇది. ఎంతో రుచికరంగా ఉండే ఈ చేపలు.. శీతల వాతావరణంలో మాత్రమే బతుకుతాయి. వీటి పెంపకానికి కశ్మీర్లోని వాతావరణ పరిస్థితులు సరిగ్గా సరిపోతాయి. 1889లో ఓ బ్రిటిష్ అధికారి ఫ్రాంక్ జాన్ మిషెల్.. ఈ రకం చేపను కశ్మీర్కు మొదటిసారిగా తీసుకొచ్చారు. అప్పటినుంచి దక్షిణ కశ్మీర్, అనంత్నాగ్ జిల్లాలోని కోకర్నాగ్లో ఏర్పాటు చేసిన చేపపిల్లల ఉత్పత్తి కేంద్రంలో ఈ మంచుప్రాంత చేపల పెంపకం పెద్దఎత్తున జరుగుతోంది. 38 ఎకరాల భూమిలో 30కు పైగా కాలువలకు ఈ కేంద్రం విస్తరించింది.
"మంచుప్రాంత చేపల పెంపకం చేపడుతున్న ఈ ప్రాజెక్టు ఆసియాలోనే అతిపెద్దది. రెయిన్బో చేపలను మాత్రమే ఇక్కడ పెంచుతాం. ఈ చేపలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అన్ని తాజా చేపల్లో ఒమేగా-6 ఉంటుంది కానీ శీతల చేపలు మాత్రం పెద్దసంఖ్యలో ఒమేగా-3ని కలిగి ఉంటాయి. ఈ ఆమ్లాలు పలు హృద్రోగాల నుంచి కాపాడతాయి. చదువుకున్న యువతీయువకులు ముందుకొచ్చి, ఈ చేపల పెంపకాన్ని చేపట్టాల్సిందిగా సూచిస్తున్నాను. ఇదో మంచి లాభదాయకమైన వ్యాపారం.
-- మొహమ్మద్ ముజఫర్, ప్రాజెక్టు ప్రధాన అధికారి
ఆసియాలే అతి పెద్దది..
ఓ ఐరోపా సంస్థ సహకారంతో 1984లో ఈ బ్రీడింగ్ సెంటర్ను ఏర్పాటుచేశారు. ఈ కేంద్రం ఆసియాలోనే చేపల సాగు చేస్తున్న అతిపెద్ద క్షేత్రంగా పేరుగాంచింది. శీతల చేపల అమ్మకం ద్వారా 2020లో మత్య్సశాఖకు కోటీ 75 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది 2 కోట్ల ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
కోకర్నాగ్ బ్రీడింగ్ కేంద్రంలో ఏటా 18 నుంచి 20 మంది ఔత్సాహిక వ్యాపారవేత్తలు శిక్షణ పొందుతున్నారు. మత్స్య విభాగం ఆరునెలల పాటు శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తోంది. కశ్మీర్ విశ్వవిద్యాలయం నుంచి అధ్యాపకులు, విద్యార్థులు కూడా ఈ కేంద్రంలో తమ ప్రాజెక్టులకు సంబంధించిన పరిశోధనలు చేసుకుంటారు.
"ముందు మేం ఈ మంచుప్రాంత చేపలను వర్గీకరిస్తాం. అంటే ఆడ, మగ చేపలను వేరుచేస్తాం. ఆడ చేపల నుంచి గుడ్లు తీసి, సరైన సమయంలో ఫలదీకరణ కోసం పక్కకు పెడతాం. వాటిని ప్రాసెస్ చేస్తే, 21 రోజుల్లో 5 నుంచి 10 గ్రాముల బరువైన చేపపిల్లలుగా మారతాయి."
-- మంజూర్ అహ్మద్, ప్రాజెక్ట్ సూపర్వైజర్
ఈ బ్రీడింగ్ సెంటర్ నుంచి చేపగుడ్లను వివిధ రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఏడాదికి 7 లక్షల చేపగుడ్లు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్, భూటాన్కు సరఫరా అవుతున్నాయి. ఫలితంగా మత్య్సశాఖకు దాదాపు ఒకటిన్నర కోట్ల రూపాయల రాబడి వస్తోంది. కశ్మీర్లో మొత్తంగా 37 చేపల బ్రీడింగ్ కేంద్రాలుండగా.. వాటిలో రెయిన్బో, బ్రౌన్ చేపల ఉత్పత్తి జరుగుతోంది.
ఇదీ చదవండి : గల్లంతైన ఆ నౌకలో 37కు చేరిన మృతులు