రైతుల ఆందోళనలపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ నేడు తొలిసారి సమావేశం కానుంది. రైతులు వ్యతిరేకిస్తోన్న చట్టాల అమలును నిలిపేస్తూ సుప్రీంకోర్టు ఈ నెల 11న స్టే విధించింది. ఈ అంశంపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు నలుగురు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ.. దిల్లీలోని పుసా క్యాంపస్లో భేటీ కానుంది. సభ్యుల్లో ఒకరైన భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు భూపీందర్సింగ్ మాన్ కమిటీ నుంచి తప్పుకున్నారు. దీంతో ఈ భేటీలో అనిల్ ఘన్వాత్తో పాటు.. డాక్టర్ ప్రమోద్ కుమార్ జోషీ, అశోక్ గులాటీలు మాత్రమే పాల్గొనే అవకాశం ఉంది.
భూపీందర్సింగ్ మాన్ స్థానంలో సుప్రీంకోర్టు మరో సభ్యుడిని సూచించకపోతే.. కేవలం ముగ్గురు సభ్యులం హాజరవుతాం.
-అనిల్ ఘన్వాత్, మహారాష్ట్ర షేట్కారీ సంఘటన్ అధ్యక్షుడు.
మార్గదర్శకాలున్నాయ్..
కమిటీ చేయాల్సిన పనిపై ఇప్పటికే మార్గదర్శకాలు అందాయని.. జనవరి 21 నుంచి తమ పని ప్రారంభిస్తామని అనిల్ ఘన్వాత్ తెలిపారు. భవిష్యత్ కార్యచరణపై ఈ సమావేశంలో చర్చిస్తామన్నారు. ఇక రైతులు, ప్రభుత్వం మధ్య చర్చలు కొనసాగడంపై ఎలాంటి అభ్యంతరం లేదని.. పరిష్కారం ఎక్కడ దొరికినా ఇబ్బంది లేదని ఘన్వాత్ అభిప్రాయపడ్డారు. చట్టాలకు అనుకూల, వ్యతిరేక వాదనలను ఈ ప్యానెల్ విని.. రెండు నెలల్లోగా సుప్రీం కోర్టుకు ఒక నివేదికను సమర్పిస్తుంది.
ఇదీ చదవండి: 'రైతులతో 10వ దఫా చర్చలు వాయిదా'