మే 1 నుంచి ప్రారంభం కానున్న మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ.. తమ రాష్ట్రాల్లో ఆలస్యం కావొచ్చని దిల్లీ, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాలు స్పష్టం చేశాయి. టీకాల కొరతే ప్రధాన కారణమని తెలిపాయి.
టీకాల కొరతే కారణం..
మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించటానికి.. తమ దగ్గర వ్యాక్సిన్లు లేవని దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి స్పష్టం చేశారు. 67లక్షల కోవిషీల్డ్ డోసులు ఆర్డర్ ఇచ్చామన్నారు. మే1 నుంచి 18ఏళ్లు పైబడిన వారందరికీ కరోనా టీకా పంపిణీ పంజాబ్లో ఆలస్యం అవనుందని ఆందోళన వ్యక్తం చేశారు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి బల్బీర్ సింగ్ సిద్ధూ. రాష్ట్రంలో సరిపడా కరోనా టీకాలు లేకపోవడమే ఇందుకు కారణమని తెలిపారు. 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ పంపిణీలోనూ టీకాల కొరత ఉందని మహారాష్ట్ర, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు చేశాయి.
అదేం లేదు..
అయితే కేంద్ర ఆరోగ్య, వైద్య శాఖ మాత్రం.. దేశంలో టీకా కొరత లేదని స్పష్టంచేసింది. ఇంకా కోటికి పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల దగ్గర ఉన్నాయని వివరించింది. మరో మూడు రోజుల్లో 20 లక్షలకుపైగా డోసులను రాష్ట్రాలకు అందిస్తామని పేర్కొంది.
ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 15 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులను అందించామని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి : ప్రధాని నేతృత్వంలో నేడు కేంద్ర మంత్రిమండలి భేటీ