దిల్లీ సరిహద్దుల్లో నిరసన చేస్తున్న రైతుల మన్కీ బాత్(మనసులో మాట)ను కేంద్ర ప్రభుత్వం వినిపించుకోవడం లేదని కాంగ్రెస్ విమర్శించింది. కార్పొరేట్ల మాదిరిగా కాకుండా.. రైతులు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ను మాత్రమే అడుగుతున్నారని పేర్కొంది. వార్షిక బడ్జెట్పై రాజ్యసభలో చర్చను ప్రారంభించిన కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్.. కనీస మద్దతు ధరకు ఎందుకు చట్టబద్ధత కల్పించడం లేదని ప్రశ్నించారు.
కేంద్రం తీసుకొచ్చినటువంటి సాగు చట్టాలను అమెరికా, ఐరోపాల్లో ఇప్పటికే అమలు చేశారని తెలిపారు సిబల్. వాటి ఫలితంగా వ్యవసాయం మొత్తం కార్పొరేట్ పరమైందని చెప్పారు. 22 పంటలకు ఎంఎస్పీని నిర్ణయిస్తున్న ప్రభుత్వం.. కేవలం వరి, గోధుమలు, కొన్ని పప్పు ధాన్యాలను మాత్రమే కొనుగోలు చేస్తోందని తెలిపారు.
"సమస్యేంటంటే మీరు రైతుల మన్కీ బాత్ వినడం లేదు. ఎప్పుడు మీ మన్కీ బాత్ గురించే చెబుతారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలనే రైతులు అడుగుతున్నారు. అది ఇచ్చేందుకు మీరు సిద్ధంగా లేరు. పేద రైతులు 'కనీసం' కోరుకుంటుంటే.. మీరు కార్పొరేట్లకు 'గరిష్ఠం' ఇస్తున్నారు. భారత్లో రైతులకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు చైనా, అమెరికా, ఐరోపాతో పోలిస్తే తక్కువే. అమెరికాలో ఒక్కో రైతు 62 వేల డాలర్లను సబ్సిడీగా పొందుతున్నారు. రైతులు ఎక్కువగా ఏం అడగరు. కార్పొరేట్లే అడుగుతారు."
-కపిల్ సిబల్, కాంగ్రెస్ నేత
భారత్లో రైతుల సబ్సిడీకి ప్రభుత్వం 11 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తుంటే.. అమెరికా, చైనా, ఐరోపాలలో ఈ వ్యయం వరుసగా.. 185.9, 101.2, 48.9 బిలియన్ డాలర్లుగా ఉందని సిబల్ వివరించారు. ఈ చట్టాలు భారత్లోని వ్యవసాయాన్ని సైతం కార్పొరేట్ పరం చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో ప్రస్తుతం చిన్న కమతాలు కనుమరుగైపోయాయని చెప్పారు. అమెరికాలో 1.5 శాతం ప్రజలు మాత్రమే వ్యవసాయం చేస్తున్నారని, భారత్లో ఈ సంఖ్య 50 శాతంగా ఉందని తెలిపారు.
ఆస్తులన్నీ ఆ సంస్థల వద్దే
బడ్జెట్ను అంకెల గారడీగా అభివర్ణించిన కపిల్.. బ్యాంకులను లూటీ చేసే రాజకీయాలు చేస్తోందని కేంద్రంపై మండిపడ్డారు. పెట్టుబడిదారులకు పెద్దపీట వేసి పేద ప్రజలను విస్మరించారని ధ్వజమెత్తారు. 2018లో ఒక శాతం మంది వద్ద దేశంలోని 58 శాతం ఆస్తులు ఉంటే.. 2019 నాటికి ఈ సంఖ్య 75 శాతానికి పెరిగిందన్నారు. 4-5 పెద్ద కార్పొరేట్ సంస్థలే దేశంలోని ఆస్తులను తన గుప్పిట్లో ఉంచుకున్నాయని తెలిపారు. నీతి ఆయోగ్ అభ్యంతరాలను పక్కనబెట్టి.. ప్రాజెక్టులన్నీ ఆ సంస్థలకే కట్టబెడుతున్నారని చెప్పారు.
బ్యాంకు రుణాలతో పెట్రోల్!
మరో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సైతం బడ్జెట్పై విమర్శలు కురిపించారు. లోక్సభలో మాట్లాడిన ఆయన.. మధ్యతరగతి వర్గానికి సాంత్వన కలిగించేలా బడ్జెట్లో ఎలాంటి అంశాలు లేవన్నారు. గత ఏడు సంవత్సరాలుగా మధ్యతరగతి వర్గాన్ని ప్రభుత్వం విస్మరించిందని దుయ్యబట్టారు. పెట్రోల్ కొనుగోలు చేసేందుకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయాల్సి ఉంటుందని ఎద్దేవా చేశారు.
"వైద్య, రక్షణ రంగాల్లో కేటాయింపులపై ప్రజలను మోసం చేసే బడ్జెట్ ఇది. జై జవాన్, జై కిసాన్ అని లాల్ బహదూర్ శాస్త్రి నినాదమిచ్చారు. రైతులు, సైనికులకు ప్రాధాన్యం లేని బడ్జెట్ ఇది. మధ్యతరగతి వర్గం కోసం మీరు పెట్రోల్ ధరలు పెంచారు. 2014 తర్వాత పెట్రోల్పై ఎక్సైజ్ సుంకం 348 శాతం పెరిగింది. పెట్రోల్ కొనేందుకు బ్యాంకులు త్వరలోనే రుణ సదుపాయాన్ని కల్పించాల్సి ఉంటుంది."
-శశిథరూర్, కాంగ్రెస్ ఎంపీ
అనంతరం మాట్లాడిన భాజపా ఎంపీ మీనాక్షీ లేఖీ.. మోదీ ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల భారత్.. ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల సరసన చేరిందని చెప్పారు. ఇప్పుడు మనం రెండంకెల వృద్ధి గురించి మాట్లాడుకుంటున్నామని తెలిపారు. కరోనాను సమర్థంగా కట్టడి చేసి.. ఇప్పుడు జీవనోపాధిపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని వెల్లడించారు. చాలా రంగాలకు రెట్టింపు కేటాయింపులు చేసినట్లు చెప్పుకొచ్చారు.