కొవిడ్ నేపథ్యంలో దేశంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు 36,433 వెంటిలేటర్లను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీటిని దేశీయంగా తయారు చేయడం వల్ల వాటి సగటు వ్యయం రూ.2-10 లక్షల మధ్య ఉందని పేర్కొంది.
కరోనా ప్రారంభ కాలంలో వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కుల కొరత అధికంగా ఉండేది. పైగా నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేవి కావు. వాటి కోసం ఎక్కువగా బయటి దేశాల పైన ఆధారపడే వాళ్లం. ప్రస్తుతం ఈ వైద్య పరికరాల విషయంలో స్వయం సమృద్ధి సాధించాం. వీటిని ఎగుమతి చేయొద్దంటూ గతంలో ఉన్న ఆంక్షలు ప్రస్తుతం తొలిగిపోయాయి. దేశ అవసరాలకు అనుగుణంగా వీటి ఉత్పత్తి జరిగింది.
- కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
అంకెల్లో పురోగతి..
- కరోనాకు ముందు భారత్లో 16వేల వెంటిలేటర్లు మాత్రమే ఉండగా.. 12 నెలల స్వల్ప కాలంలోనే ఈ సంఖ్య 36,433 కు పెరిగింది. వీటిని దేశంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు చేరవేశారు.
- వ్యక్తిగత రక్షణ పరికరాల(పీపీఈ) తయారీలో ప్రస్తుతం భారత్.. ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. దాదాపు 1.7 లక్షల కోట్ల పీపీఈలను దేశంలోని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగా పంపిణీ చేశారు. తొమ్మిది నెలల క్రితం రూ.600గా ఉన్న కిట్ ధర ప్రస్తుతం రూ.200కు తగ్గింది.
- 4కోట్లకు పైగా ఎన్-95 మాస్కులను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగా పంపిణీ చేసింది కేంద్రం. మార్చిలో 9 లక్షలుగా ఉన్న వీటి నిల్వ, ప్రస్తుతం 1.46 కోట్లకు పెరిగింది. గతంలో రూ.40 ఉన్న మాస్కు ధర అమాంతం రూ.12కు తగ్గింది.
'వీటితో పాటు 83 కోట్ల సిరంజీల తయారీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరో 35 కోట్ల సిరంజీల ఉత్పత్తికి బిడ్లను ఆహ్వానించింది. వీటిని కొవిడ్ వ్యాక్సినేషన్తో పాటు.. సార్వత్రిక రోగ నిరోధక కార్యక్రమంలో ఉపయోగించనున్నట్లు' మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇదీ చదవండి: ఆక్స్ఫర్డ్ టీకా సురక్షితమా? ఈ సందేహాల సంగతేంటి?