ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు ఏడో వసంతం పూర్తి చేసుకుని, ఎనిమిదో వసంతంలోకి అడుగుపెడుతున్న వేళ.. ప్రతిపక్షాలపై భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ఆదివారం విమర్శలు గుప్పించారు. కరోనా సంక్షోభం వేళ.. తమ పార్టీ నేతలు సహాయక చర్యల్లో పాల్గొంటుంటే.. ప్రతిపక్షాలు మాత్రం క్వారంటైన్లో గడుపుతున్నాయని ఎద్దేవా చేశారు. పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన వర్చువల్గా పాల్గొన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. ప్రతి ఎంపీ, ఎమ్మెల్యే.. కనీసం రెండు గ్రామాల్లోని ప్రజలకు సేవ చేయాలని కోరారు.
"మహమ్మారి విజృంభణ వేళ.. ప్రజలకు భాజపా కార్యకర్తలకు సహాయం చేస్తున్నారు. ప్రతిపక్ష నేతలు మాత్రం వర్చువల్ విలేకరుల సమావేశంలో మాత్రమే కనిపిస్తున్నారు. మా కార్యకర్తలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వేళ.. వాళ్లేమే క్వారంటైన్లో కాలం వెళ్లదీస్తున్నారు."
-జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు
వ్యాక్సిన్ల కోసం ఇప్పుడు ఎవరైతే ఎదురు చేస్తున్నారో.. ఒకప్పుడు వారే టీకాలపై అనుమానాలు లేవనెత్తారని నడ్డా విమర్శించారు. భాజపా తలపెట్టిన కరోనా సహాయ సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని జెండా ఊపి ఆయన ప్రారంభించారు.
మరోవైపు.. పార్టీ వార్షికోత్సవంలో భాగంగా.. 'సేవా దివస్' పేరుతో పలు సేవా కార్యక్రమాలకు భాజపా శ్రీకారం చుట్టింది. కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా సహాయక చర్యల్లో పాల్గొనాలని కార్యకర్తలకు పిలుపునిచ్చింది.
ఇదీ చూడండి: Mann Ki Baat: 'సబ్కా సాత్, వికాస్, విశ్వాస్ మంత్రంతో ముందుకు'