మూడో విడత వ్యాక్సినేషన్లో భాగంగా 18 ఏళ్లు దాటిన వారికి కరోనా టీకా పంపిణీ కార్యక్రమాన్ని పలు రాష్ట్రాలు ప్రారంభించాయి. దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోనే టీకా పంపిణీ ప్రారంభమైంది. మూడో విడతలో టీకాల కోసం లబ్ధిదారులు పోటెత్తారు. 2.45 కోట్ల మందికిపైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
ఒడిశాలో మూడో విడత కొవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. 18 నుంచి 45 ఏళ్ల మధ్యవారికి టీకాలు ఇచ్చేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపడతామని ఒడిశా ప్రభుత్వం తెలిపింది.
మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఈ కార్యక్రమం ప్రారంభమైంది. పుణె జిల్లాలోని 19 కేంద్రాల్లో 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు వారికి కరోనా టీకా వేస్తున్నట్లు ఆ జిల్లా ఆరోగ్య అధికారి తెలిపారు. నాగ్పుర్లోనూ టీకా పంపిణీ ప్రారంభమైంది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్లోనూ మూడో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైనట్లు ఆయా రాష్ట్రాల అధికారులు పేర్కొన్నారు. దశల వారీగా 18 నుంచి 45 ఏళ్లలోపు వారికి కరోనా టీకా అందిస్తామని జమ్మూ కశ్మీర్ ప్రజాసంబంధాల శాఖ ట్విటర్ ద్వారా వెల్లడించింది.
కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు మూడో విడత కొవిడ్-19 వ్యాక్సినేషన్లో భాగంగా 18 ఏళ్ల పైబడినవారికి టీకాలు ఇచ్చే కార్యక్రమం శనివారం ప్రారంభం కాగా.. పలు రాష్ట్రాలు ఇందుకు దూరంగా ఉన్నాయి. వ్యాక్సిన్ల కొరత, ఇతర సాంకేతిక ఇబ్బందుల కారణంగా దీన్ని వాయిదా వేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, దిల్లీ, పశ్చిమ బెంగాల్, పంజాబ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాలు ప్రకటించాయి.
ఇదీ చూడండి:'రాష్ట్రాల వద్ద ఇంకా 79 లక్షల టీకాలు'