ఈశాన్య భారతంలో రానున్న రోజుల్లో క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య భారీగా పెరగనుంది. 2025 నాటికి 57,131 కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్), బెంగళూరులోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మేటిక్స్ అండ్ రీసెర్చ్(ఎన్సీడీఐఆర్) సంస్థలు విడుదల చేసిన ఓ నివేదిక తెలిపింది. ప్రపంచ క్యాన్సర్ దినం సందర్భంగా గురువారం ఈ వివరాలను వెల్లడించాయి. 2020లో క్యాన్సర్ కేసుల సంఖ్య అక్కడ 50,317గా ఉన్నట్లు ఐసీఎంఆర్ అంచనా వేసింది.
11 జనాభా ఆధారిత క్యాన్సర్ రిజిస్ట్రీస్(పీసీబీసీఆర్), 7 ఆసుపత్రి ఆధారిత క్యాన్సర్ రిజిస్ట్రీస్(హెచ్బీసీఆర్)ల సమాచారం ఆధారంగా ఈ నివేదికను పొందుపర్చామని ఐసీఎంఆర్ తెలిపింది. ఆరోగ్య రంగంలో భవిష్యత్లో తీసుకోవాల్సిన విధానపరమైన నిర్ణయాలకు ఈ నివేదిక.. మార్గదర్శకత్వం కానుందని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ పేర్కొన్నారు.
నివేదికలోని కీలక అంశాలు..
- మణిపుర్, సిక్కిం రాష్ట్రాలు మినహా.. మిగతా ఈశాన్య రాష్ట్రాల్లో మహిళల కంటే పురుషులే ఎక్కువగా క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి.
- పురుషులు ఎక్కువగా క్యాన్సర్ బారిన పడే అవకాశాలు మిజోరాంలోని ఐజ్వాల్ జిల్లాలో ఉన్నాయి. అక్కడ 269.4 శాతం పురుషులు క్యాన్సర్ ధాటికి గురవుతారని అంచనా.
- మహిళలు(219.8 శాతం) ఎక్కువగా క్యాన్సర్ బారిన పడే అవకాశాలు అరుణాచల్ ప్రదేశ్లోని పుపుంపరే జిల్లాలో ఉన్నాయి.
- పొగాకు వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం.. పురుషుల్లో 49.3 శాతం, మహిళల్లో 22.8 శాతం.
8 ఈశాన్యరాష్ట్రాల్లోనూ మహిళల కంటే పురుషుల్లోనే బ్లడ్ షుగర్ లెవల్స్ అధికంగా ఉన్నాయని నివేదిక చెబుతోంది.
ఇదీ చదవండి:క్యాన్సర్ అంటే ఏంటి? నివారణ మార్గాలేంటి?