Netaji hologram statue India Gate: స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించేలా కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. దిల్లీలో అబ్బురపరిచే నేతాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. గ్రానైట్తో తయారు చేసే ఈ విగ్రహాన్ని ఇండియా గేట్ వద్ద స్థాపించనున్నట్లు వెల్లడించారు.
![MODI NETAJI STATUE](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14243603_fjm56cyxiaikyzf-1.jpg)
Subhas Chandra Bose granite statue:
పూర్తిస్థాయి విగ్రహం రూపొందే వరకు ఈ ప్రదేశంలో నేతాజీ హాలోగ్రామ్ (బీమ్ లైట్లతో ఏర్పాటు చేసే 3డీ చిత్రం) విగ్రహం ఉంటుందని మోదీ తెలిపారు. నేతాజీ జయంతి అయిన జనవరి 23న హాలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు. నేతాజీకి భారత్ రుణపడి ఉంటుందని, ఇందుకు ఈ విగ్రహమే తార్కాణమని మోదీ పేర్కొన్నారు.
![MODI NETAJI STATUE](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14243603_fjm56cyxiaikyzf-2.jpg)
ఇదే సరైన నివాళి..
నేతాజీ విగ్రాహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించడాన్ని స్వాగతించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. దేశ స్వేచ్ఛ కోసం సర్వం ధారపోసిన యోధునికి ఇదే సరైన నివాళి అని ట్వీట్ చేశారు.
యువతకు స్ఫూర్తి..
నేతాజీ విగ్రహం ఏర్పాటుతో దేశంలోని యువత స్ఫూర్తి పొందుతారని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ ఆకాంక్షించారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు.
ఇండియా గేట్ వద్ద ఉన్న అమర జవాను జ్యోతిని.. జాతీయ యుద్ధస్మారకం వద్ద ఉన్న జ్యోతితో కలపాలని కేంద్రం నిర్ణయించడం, బంగాల్ శకటాన్ని గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించేందుకు నిరాకరించిన నేపథ్యంలో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇప్పుడు దిల్లీ గేటు వద్ద నేతాజీ విగ్రాహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: ఆరనున్న అమర జవాను జ్యోతి.. మండిపడ్డ కాంగ్రెస్