Narcotics Bureau Officials Issued Notices to Hero Navdeep : మాదక ద్రవ్యాల కేసులో హీరో నవదీప్కు నార్కోటిక్ విభాగం పోలీసులు 41ఏ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 23న బషీర్బాగ్లోని నార్కోటిక్ పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో (Madhapur Drugs Case ) హీరో నవదీప్ను పోలీసులు 37వ నిందితుడిగా చేర్చారు. పోలీసులు ఇప్పటి వరకు 11మందిని అరెస్ట్ చేశారు. మత్తు పదార్థాలు విక్రయించే రాంచందర్తో నవదీప్కు ఉన్న పరిచయాలపై నార్కోటిక్ పోలీసులు ఆధారాలు సేకరించారు.
Madhapur Drugs Case Updates : వాట్సాప్ చాటింగ్తో పాటు... కాల్ డేటాను సేకరించారు. దీని ఆధారంగా నవదీప్ను పోలీసులు ప్రశ్నించనున్నారు. ఇదే కేసులో మరికొంత మంది ఉన్నట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారు. పబ్ యజమాని సూర్య, కలహార్ రెడ్డి, శ్వేత, సినీ ఫైనాన్షియర్ రవి, కార్తీక్, శ్వేతలను డ్రగ్స్ వాడకందారులుగా చేర్చారు. వీళ్లంతా కూడా హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసుల్లోనూ నార్కోటిక్ పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. హీరో నవదీప్ను (Hero Navdeep) ప్రశ్నించడం ద్వారా డ్రగ్స్ కేసులో మరింత సమాచారం వచ్చే అవకాశం ఉందని నార్కోటిక్ విభాగం పోలీసులు భావిస్తున్నారు.
Hyderabad Drugs Case Update : మరోవైపు మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఒక్కొక్కటిగా చీకటి కోణాలు బయటికి వస్తున్నాయి. పట్టుబడ్డ నిందితులు మత్తుదందాలను అడ్డుపెట్టుకుని.. చిత్రనిర్మాతలుగా అవతారం ఎత్తారని పోలీసుల విచారణలో తేలింది. నైజీరియన్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి, రేవ్ పార్టీల వంటి కార్యక్రమాలకు తెరలేపుతున్నారని నార్కోటిక్ పోలీసులు గుర్తించారు. వీటికి సినీ, రాజకీయ మిత్రులను ఆహ్వానించి.. వారితో పరిచయాలు పెంచుకుంటున్నారని పేర్కొన్నారు. నిందితులు బాలాజీ, రాంకిశోర్, కల్హర్రెడ్డి సెల్ఫోన్ల డేటాలో పలువురు సినీ రంగ ప్రముఖుల ఫోన్ నంబర్లను పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.
ఈ కేసు దర్యాప్తును నార్కోటిక్ పోలీసులు ముమ్మరం చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సినీ నిర్మాతలు వెంకటరత్నారెడ్డి, రవి ఉప్పలపాటిలకు విశాఖపట్నానికి చెందిన రాంకిశోర్, నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ నేవీ ఉద్యోగి బాలాజీ ద్వారా డ్రగ్స్ చేరేవని తెలుస్తోంది. బెంగళూరులోని డ్రగ్స్ సరఫరా చేసే నైజీరియన్ల ముఠాతో బాలాజీకి పరిచయాలున్నాయి. అక్కడి నుంచి హెరాయిన్, కొకైన్, ఎల్ఎస్డీ బ్లాట్లు తీసుకొచ్చేందుకు రాంకిశోర్ సహకరించేవాడు. డ్రగ్స్ను బెంగళూరులో ఉంటున్న నైజీరియన్ల నుంచి కొనుగోలు చేసి.. రాష్ట్రంలో సినీ, రాజకీయ ప్రముఖులకు విక్రయించేవారు. గచ్చిబౌలి, మాదాపూర్లోని విలాసవంతమైన అపార్టుమెంట్లను అద్దెకు తీసుకుని రేవ్పార్టీలు నిర్వహించేవారు. మోడలింగ్, సినీ అవకాశాల కోసం ఎదురుచూసే యువతులకు మాదకద్రవ్యాలు ఎరవేసి రప్పించేవారు.
Hyderabad SI Rajendra Drugs Case Update : డ్రగ్స్ కేసు అప్డేట్.. SI రాజేంద్ర కాల్డేటాలో అసలుగుట్టు
ఇటీవల అరెస్టైన 8 మంది నిందితులకు పోలీసు కస్టడీ కోరుతూ మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మురళీ వెంకట రత్నారెడ్డి, భాస్కర్లను అరెస్ట్ చేసినప్పుడు బయటపడిన సమాచారంతో ఈ నెల 14న ముగ్గురు నైజీరియన్లు సహా మాజీ ఎంపీ కుమారుడు దేవరకొండ సురేశ్రావు, రాంచంద్, సుశాంత్రెడ్డి, కె.సందీప్, శ్రీకర్ కృష్ణప్రసాద్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వీరి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు 7 రోజులు కస్టడీ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.