కరోనా ఉద్ధృతి నేపథ్యంలో తమిళనాడులో జూన్ 14 వరకు లాక్డౌన్ను పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. అయితే ఆంక్షల్లో పలు సడలింపులు ఉంటాయని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది.
సడలింపుల దిశగా మహారాష్ట్ర..
మహమ్మారిని కట్టడి చేసేందుకు కఠిన ఆంక్షలను అమలు చేసిన మహారాష్ట్ర ఈనెల 7 నుంచి ఆంక్షలను సడలించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ వారంలో వచ్చే పాజిటివిటీ రేట్ను సహా వినియోగంలో ఉన్న ఆక్సిజన్ బెడ్ల సంఖ్యను గమనించి ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
మొత్తం ఐదు దశల్లో క్రమంగా లాక్డౌన్ను సడలించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.
- లెవెల్-1: పాజిటివిటీ రేటు ఐదు శాతం లేదా అంతకంటే తక్కువ ఉండి, ఆసుపత్రుల్లో పడకలు 25 శాతం కంటే తక్కువ నిండి ఉన్న జిల్లాలు లెవెల్ 1 కిందకు వస్తాయి. ఈ జిల్లాల్లో లాక్డౌన్ను పూర్తిగా ఎత్తివేస్తారు. ప్రజా రవాణా, సాంస్కృతిక కార్యక్రమాలు, దుకాణాలు, రెస్టారెంట్లు, స్పోర్ట్స్, థియేటర్లు, మాల్స్, పరిశ్రమలు, ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలు తెరిచేందుకు అనుమతి లభిస్తుంది. వివాహాలు, అంత్యక్రియలు ఎలాంటి నిబంధనలు లేకుండా సాధారణంగా జరుపుకునేందుకు అనుమతిస్తారు.
- లెవెల్-2: ఐదు శాతం పాజిటివిటీ రేటు, ఆసుపత్రుల్లో 25-40 శాతం పడకలు నిండి ఉన్న జిల్లాలు లెవెల్2 కిందకు వస్తాయి. ఇక్కడ సెక్షన్ 144 అమల్లో ఉంటుంది. థియేటర్లు, రెస్టారెంట్లు, జిమ్లు, సెలూన్లు 50 శాతం సామర్థ్యంలో తెరవొచ్చు. ఇతర దుకాణాలు సాధారణ సమయాల్లో తెరిచి ఉంచేందుకు అనుమతి ఉంటుంది.
- లెవెల్-3: పాజిటివిటీ రేటు 5-10 శాతం, ఆసుపత్రుల్లో 40-60 శాతం పడకలు నిండి ఉన్న జిల్లాలు లెవెల్3 కిందకు వస్తాయి. ఈ ప్రాంతాల్లో నిత్యావసర సరకులు అమ్మే దుకాణాలు, జిమ్లు, సెలూన్లు, రెస్టారెంట్లు సాయంత్రం 4 గంటల వరకు తెరిచి ఉంటాయి. మాల్స్, థియేట్లు, మూసి ఉంటాయి. సెక్షన్ 144 అమల్లో ఉంటుంది.
- లెవెల్-4: పాజిటివిటీ రేటు 10-20 శాతం, ఆసుపత్రుల్లో 60-75 శాతం పడకలు నిండి ఉన్న జిల్లాలు లెవెల్-4 కిందకు వస్తాయి. అన్ని నిత్యవసర దుకాణాలు సాయంత్రం 4 గంటల వరకు తెరిచి ఉంటాయి. సాయంత్రం 5 గంటలు, వారాంతాల్లో పూర్తిస్థాయి లాక్డౌన్ కొనసాగుతుంది. పారిశ్రామిక కార్యకలాపాలు, ప్రజా రవాణా 50శాతం సామర్థ్యంతో కొనసాగాలి.
- లెవెల-5: పాజిటివిటీ రేటు 10-20 శాతం, ఆసుపత్రుల్లో 75 శాతం కంటే ఎక్కువ పడకలు నిండి ఉన్న జిల్లాలు లెవెల్-5 కిందకు వస్తాయి. ఈ జిల్లాల్లో పూర్తి స్థాయి లాక్డౌన్ కొనసాగుతుంది.
దిల్లీలో మరిన్ని సడలింపులు..
విడతల వారీగా ఆంక్షలను సడలిస్తున్న దిల్లీ ప్రభుత్వం.. వచ్చే వారం నుంచి మరికొన్ని సడలింపులకు సిద్ధమైంది. బేసి-సరి సంఖ్య పద్ధతిలో మార్కెట్లు, మాల్స్కు అనుమతిస్తున్నానని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వెల్లడించారు. 50 శాతం సామర్థ్యంతో మెట్రో రైళ్ల సేవలు ప్రారంభం కానున్నాయని స్పష్టం చేశారు. ప్రైవేటు, ప్రభుత్వ గ్రూప్ బీ కార్యాలయాలు 50 శాతం సామర్థ్యం.. ప్రభుత్వ గ్రూప్ ఏ కార్యాలయాలు 100 శాతం సామర్థ్యంతో పనిచేసేందుకు అనుమతిస్తున్నామని పేర్కొన్నారు.
ప్రభుత్వం థర్డ్ వేవ్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని సీఎం తెలిపారు. ఆక్సిజన్ కొరత లేకుండా తగిన చర్యలు చేపట్టడం సహా పీడియాట్రిక్ టాక్స్ ఫోర్స్ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి : Covid-19 Updates: కొత్తగా 1.20లక్షల కేసులు