తన శక్తి మేర సమర్థంగా విధులు నిర్వహించానన్న సంతృప్తితోపాటు సంతోషం, సద్భావన, ఎన్నో జ్ఞాపకాలతో సుప్రీంకోర్టును వీడుతున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే తెలిపారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ ఎన్వీ రమణ తన విధులను సమర్థంగా నిర్వహిస్తారన్న నమ్మకం ఉందన్నారు.
"ప్రధాన న్యాయమూర్తిగా చివరి రోజు మిశ్రమ అనుభూతి మిగిల్చింది. ఈ భావాలను వర్ణించడం సాధ్యం కాదు. సంతృప్తితోపాటు, సంతోషం, సద్భావన, ఎన్నో జ్ఞాపకాలతో సుప్రీం కోర్టును వీడుతున్నాను. దేశ సర్వోన్నత ధర్మాసనంలో భాగస్వామిని కావడం గర్వంగా ఉంది. న్యాయమూర్తిగా 21 సంవత్సరాలు విధులు నిర్వహించిన తర్వాత పదవి నుంచి వైదొలుగుతున్నాను. ఇది నాకు చాలా జ్ఞాపకాలను మిగిల్చింది."
-- జస్టిస్ ఎస్ఏ బోబ్డే
కరోనా సమయంలో జస్టిస్ బోబ్డే ప్రారంభించిన వీడియో కాన్ఫరెన్స్ విచారణ కారణంగా 50వేల కేసులు పరిష్కారమయ్యాయని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తెలిపారు. ఇది చాలా గొప్ప విషయమని కొనియాడారు. జస్టిస్ బోబ్డే తెలివైన, వివేకవంతమైన న్యాయమూర్తి అని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రశంసించారు.
1956, ఏప్రిల్ 24న నాగ్పుర్లో జన్మించిన జస్టిస్ బోబ్డే.. 1978లో న్యాయవాదిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. బాంబే హైకోర్టులోని నాగ్పుర్ బెంచ్లో ప్రాక్టీస్ మొదలు పెట్టారు. 2012లో మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహించారు. 2013లో సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు.
ఇదీ చదవండి : 'రైల్వే, వాయుసేన సాయంతో ఆక్సిజన్ సరఫరా'