టీవీ, ఫ్రిజ్, ద్విచక్ర వాహనం, కనీసం ఐదెకరాల భూమి ఉన్న కుటుంబాలకు ఇకపై రేషన్కార్డు ఉండదనే వార్తలు కర్ణాటకలో కలకలం రేపాయి. అయితే.. ఆ వార్తలు అవాస్తవమని కాసేపటికే వివరణ ఇచ్చింది పౌర సరఫరాల శాఖ.
రాష్ట్రవ్యాప్తంగా రేషన్కార్డులను తగ్గించాలని.. ఇందుకోసం ప్రభుత్వం బీపీఎల్ నిబంధనల్ని మారుస్తున్నట్టు వార్తలొచ్చాయి. టీవీ, ఫ్రిజ్, బైక్, ఐదెకరాల భూమి కలిగి ఉన్న కుటుంబాల బియ్యం కార్డులు రద్దు కానున్నాయని పౌర సరఫరాల మంత్రి ఉమేశ్ కట్టి వ్యాఖ్యానించినట్టు ఊహాగానాలు జోరుగా వినిపించాయి. దీంతో యడియూరప్ప సర్కార్పై విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాయి. అయితే.. ఆ వార్తలు అవాస్తవమని.. ప్రస్తుతం ఉన్న బీపీఎల్ నిబంధనల్లో ఎలాంటి మార్పులూ చేపట్టడం లేదని స్పష్టం చేశారు ఉమేశ్.
అయితే.. గత ప్రభుత్వంలో అర్హత లేకపోయినా చాలా మంది చట్ట విరుద్ధంగా రేషన్కార్డులు పొందారని, కేవలం వారిపైనే చర్యలు తీసుకోబోతున్నామని ఉమేశ్ చెప్పారు. అలాంటి వారు తక్షణమే స్పందించి స్వచ్ఛందంగా తమ కార్డులను వచ్చే నెలాఖరులోగా ప్రభుత్వానికి అప్పగించాలని కోరినట్టు తెలిపారు. నిర్ధిష్ట గడువులోగా వారు స్పందికపోతే.. చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: సీఎం కుమార్తెను మోసగించిన ముగ్గురు అరెస్ట్