ETV Bharat / bharat

'స్వతంత్రంగా తీర్పులిచ్చారు.. ఆయన రిటైర్మెంట్ 'సుప్రీం'కు లోటు'

author img

By

Published : May 21, 2022, 5:44 AM IST

CJI Ramana news: జస్టిస్ లావు నాగేశ్వరరావు ధైర్యంగా, స్వతంత్రంగా తీర్పులు ఇచ్చారని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్​వీ రమణ కొనియాడారు. ఆయన పదవీ విరమణతో మంచి సలహాదారుడిని కోల్పోతున్నానని వ్యాఖ్యానించారు. యువ న్యాయవాదులకు ఆయన స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తారని పేర్కొన్నారు. మరోవైపు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవీ కాలంపై జస్టిస్ నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు.

CJI JUDGE
CJI JUDGE

CJI Ramana speech: సమాజానికి ఎంతో కొంత వెనక్కి ఇవ్వాలన్న సిద్ధాంతాన్ని బలంగా నమ్మి, దాన్ని ఆచరించిన గొప్ప వ్యక్తి సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు అని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ కొనియాడారు. ఆర్జన అధికంగా ఉన్న న్యాయవాద వృత్తిని వదిలి, దేశానికి సేవ చేసేందుకే ఆయన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారని పేర్కొన్నారు. ఆయన చేసిన త్యాగం అందరికీ సాధ్యం కాదని అన్నారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకోవాలని యువ న్యాయవాదులకు సూచించారు. జస్టిస్‌ నాగేశ్వరరావు వచ్చే నెల 7న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో వేసవి సెలవుల ముందు చివరి పనిదినమైన శుక్రవారం సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఆయనకు వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది. దానికి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జస్టిస్‌ నాగేశ్వరరావుతో తనకున్న అనుబంధాన్ని వివరించారు.

.

సీజేఐ మాట్లాడుతూ.. "ఇది చాలా భావోద్వేగపూరిత రోజు. నేను మంచి స్నేహితుడు, సలహాదారుడిని కోల్పోతున్నా. జస్టిస్‌ నాగేశ్వరరావు, నేను.. రెండు నెలల తేడాతో ఒకే ఏడాది గుంటూరులో జన్మించాం. ఆయన ఏసీ కళాశాలలో, నేను నాగార్జున విశ్వవిద్యాలయంలో చదుకున్నాం. చిన్నప్పటినుంచీ జస్టిస్‌ నాగేశ్వరరావు చాలా క్రమశిక్షణతో మెలిగారు. 1982 జులైలో ఆయన న్యాయవాదిగా చేరితే, 1983 జనవరిలో నేను ఆ వృత్తిని ప్రారంభించాను. జస్టిస్‌ నాగేశ్వరరావు గుంటూరు జిల్లా కోర్టులో ప్రాక్టీస్‌ మొదలుపెట్టి, తర్వాత హైకోర్టుకు మారారు. అక్కడ దిగ్గజ న్యాయవాది వై.సూర్యనారాయణ వద్ద జూనియర్‌గా చేరి తన సామర్థ్యాలను నిరూపించుకున్నారు. తర్వాత సాహసోపేతంగా దిల్లీకి మారారు. గాడ్‌ఫాదర్ల అండ లేకుండా ఇక్కడికొచ్చి ప్రాక్టీస్‌ చేసి విజయవంతమవడం సులభం కాదు. కానీ ఆయన దాన్ని సాధించి చూపారు. కఠోర శ్రమ, దయాగుణం, తెలివితేటలే ఆయన్ను గొప్ప న్యాయవాదిగా తీర్చిదిద్దాయి" అని పేర్కొన్నారు.

.

స్వతంత్ర న్యాయవాదిగా ఉండటమే ఇష్టం
జస్టిస్‌ నాగేశ్వరరావు రెండుసార్లు అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా పనిచేసి తనదైన ముద్ర వేశారని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ గుర్తుచేశారు. "రెండోసారి అదనపు సొలిసిటర్‌ జనరల్‌ పదవికి రాజీనామా చేసినప్పుడు.. 'ఎందుకు వైదొలిగారు? అందులోనే కొనసాగితే మంచి అవకాశాలు ఉంటాయి కదా?' అని ఆయన్ను అడిగాను. స్వేచ్ఛాయుత న్యాయవాదిగా తనదైన శైలిలో కేసులను వాదించాలనుకుంటున్నట్లు బదులిచ్చారు. న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన రెండేళ్ల తర్వాత హైదరాబాద్‌ వెళ్తున్నప్పుడు.. 'కొత్త బాధ్యతలు ఎలా ఉన్నాయి?' అన్న నా ప్రశ్నకు 'ఇంకా అలవాటుపడలేదు' అని జస్టిస్‌ నాగేశ్వరరావు సమాధానమిచ్చారు. ఆయన న్యాయమూర్తిగా ఉండటం కంటే స్వతంత్ర న్యాయవాదిగా ఉండటాన్నే ఇష్టపడ్డారు. అయినా జడ్జి బాధ్యతలను విస్మరించకుండా కష్టపడి పనిచేశారు. ధైర్యంగా, స్వతంత్రంగా తీర్పులిచ్చారు. సుప్రీంకోర్టులోనే కాకుండా దేశంలోని అన్ని ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయవాదిగా వాదనలు వినిపించిన ఘనత ఆయనకుంది" అని సీజేఐ పేర్కొన్నారు.

కీలక తీర్పులిచ్చారు
న్యాయ పరిధిని విస్తరించడంలో జస్టిస్‌ నాగేశ్వరరావు కీలక పాత్ర పోషించారని సీజేఐ ప్రశంసించారు. "మద్రాసు బార్‌ అసోసియేషన్‌ కేసు సహా పలు కేసుల్లో జస్టిస్‌ నాగేశ్వరరావు కీలక తీర్పులిచ్చారు. ట్రైబ్యునళ్లు బలహీనపడకుండా చూశారు. ఆర్డినెన్సులను పదేపదే జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని కృష్ణకుమార్‌ సింగ్‌ కేసులో తీర్పునిచ్చిన ఏడుగురు సభ్యుల ధర్మాసనంలోనూ ఆయన సభ్యుడు. ఎవరికీ బలవంతంగా టీకా ఇవ్వకూడదని, అలా చేయడం రాజ్యాంగంలోని అధికరణం-21కి విరుద్ధమని జస్టిస్‌ నాగేశ్వరరావు స్పష్టం చేశారు. వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ కల్పించడంలో భాగంగా అధికరణం-142ను ఉపయోగించి ఆజంఖాన్‌కు వినూత్న పద్ధతిలో బెయిలు మంజూరు చేశారు. దేశంలో క్రిమినల్‌ ట్రయల్స్, నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ యాక్ట్‌ కింద కేసుల విచారణను వేగవంతం చేయాలని చెప్పి.. అందుకు మార్గదర్శకాలు జారీ చేశారు" అని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ గుర్తుచేశారు.

బార్‌కు మేలిమి రత్నం
"జస్టిస్‌ నాగేశ్వరరావు పదవీ విరమణతో.. గొప్ప విశ్లేషణ శక్తి ఉన్న వ్యక్తిని మనం కోల్పోతున్నాం. ఆయన ఎదుగుదల యువ న్యాయవాదులు, న్యాయమూర్తులకు స్ఫూర్తి. హైదరాబాద్‌లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రం వ్యవస్థాపకుల్లో ఆయన ఒకరు. ఇకపై దానికి ఆయన నేతృత్వం వహిస్తారు. ఆయన నేతృత్వంలో అది ప్రపంచంలోని గొప్ప కేంద్రాల్లో ఒకటిగా నిలుస్తుందని ఆశిస్తున్నా. జస్టిస్‌ నాగేశ్వరరావు మంచి క్రికెటర్‌ కూడా. 1982లో రంజీ ట్రోఫీ ఆడారు. న్యాయవాదులు, న్యాయమూర్తుల క్రికెట్‌ జట్లకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆయన నేతృత్వంలోనే న్యాయమూర్తులు తొలిసారి కప్‌ గెలిచారు. ఆయన నటుడు, బైకర్‌. గోల్ఫ్‌ ఆటగాడు కూడా. కళలను చాలా ఇష్టపడతారు. పదవీ విరమణ తర్వాత వీటన్నింటినీ ఆస్వాదించడానికి ఆయనకు సమయం దొరుకుతుందని భావిస్తున్నా. జస్టిస్‌ నాగేశ్వరరావు ఎంతో సాత్వికుడు. 'కొందరు న్యాయవాదుల్లా కోర్టులో ఎప్పుడైనా గట్టిగా అరిచారా?' అని అని రెండు రోజులక్రితం అడిగినప్పుడు.. 'నేనెప్పుడూ అలా చేయలేదు. అలా అరిచేవారిని చూసి భయపడి పారిపోయేవాడిని' అని బదులిచ్చారు. జస్టిస్‌ నాగేశ్వరరావు కచ్చితంగా బార్‌కు మేలిమి రత్నంగా, అత్యంత అభిమానపాత్రుడైన సీనియర్‌ న్యాయవాదిగా మిగిలిపోతారు. యువ న్యాయవాదులు ఆయన్ను స్ఫూర్తిగా తీసుకోవాలి. తండ్రి లావు వెంకటేశ్వర్లు అడుగుజాడల్లో ఆయన సొంతూరును దత్తత తీసుకొని దాని అభివృద్ధికి బాటలు వేశారు" అని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ప్రశంసించారు.

పదవీకాలం కనీసం 7 ఏళ్లు ఉండాలి
దేశ సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తులుగా బాధ్యతలు చేపట్టేవారికి కనీసం 7-8 ఏళ్ల పదవీకాలం ఉండాలని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. అప్పుడే వారు ఉత్తమ పనితీరు కనబర్చగలరని పేర్కొన్నారు. అత్యున్నత న్యాయస్థానం జడ్జీల పదవీ విరమణ వయసు 65 ఏళ్లుగా ఉండటమంటే.. వారు తక్కువ వయసులో నిష్క్రమిస్తున్నట్లేనని వ్యాఖ్యానించారు. అవకాశముంటే జీవితాంతం న్యాయవాదిగా కొనసాగేందుకు తాను ఇష్టపడతానని చెప్పారు.

.

తాను వచ్చే నెల 7న పదవీ విరమణ చేయనుండటంతో.. తన గౌరవార్థం సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ శుక్రవారం ఏర్పాటుచేసిన వీడ్కోలు కార్యక్రమంలో జస్టిస్‌ నాగేశ్వరరావు ఈ మేరకు పలు కీలక అంశాలపై మాట్లాడారు. తన అనుభవాలను అందరితో పంచుకున్నారు. ఆయన ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే.. "హైకోర్టుల్లో 15-17 ఏళ్లు న్యాయమూర్తులుగా పనిచేసి సుప్రీంకోర్టుకు పదోన్నతిపై వచ్చేవారికి సగటున 4-5 ఏళ్ల పదవీకాలం మాత్రమే ఉంటుంది. ఇక్కడి పనితీరుకు అలవాటుపడటానికి వారికి రెండేళ్లు పడుతుంది. క్రమంగా అన్నింటినీ అర్థం చేసుకొని పూర్తిస్థాయిలో పనిచేయడం మొదలుపెట్టాక పదవీ విరమణ వయసు వచ్చేస్తుంది. పలువురు గతంలో న్యాయవాదులుగా పనిచేసినప్పటికీ.. తీర్పులు చెప్పడమనేది పూర్తిగా విభిన్నమైన కళ. అందులో పూర్తిస్థాయిలో ఆరితేరడానికి 3-4 ఏళ్ల సమయం పడుతుంది. కాబట్టి సుప్రీంకోర్టుకు వచ్చే న్యాయమూర్తులకు కనీసం 7-8 ఏళ్ల పదవీకాలం ఉండేలా చూడాలి. అప్పుడే వారు ఉత్తమ పనితీరు ప్రదర్శిస్తారు. నేనిక్కడ ఆరేళ్లుగా ఉన్నాను. ప్రతిరోజు కోర్టు వ్యవహారాలపై పట్టు పెంచుకున్నాను. సౌకర్యవంతంగా ఉండే స్థితికి రాగానే.. వెళ్లిపోతున్నాను. నిర్ణయాధికారం ఉన్నవారు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. పదవీకాలం ఎక్కువ ఉన్నవారిని ఇక్కడ న్యాయమూర్తిగా తీసుకోవాలి."

2014లోనే అవకాశం వచ్చినా..
"నేను దిల్లీకి మకాం మార్చేటప్పుడు మా కుటుంబసభ్యులతోపాటు స్నేహితుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అంతా బాగున్న హైకోర్టును వదులుకొని సుప్రీంకోర్టుకు వెళ్లడం ఎందుకని వారు ప్రశ్నించారు. అయితే మనం సవాళ్లను స్వీకరించకపోతే విజయం సాధించలేం. ఈ విషయాన్ని యువత గుర్తించాలి. సర్వోన్నత న్యాయస్థానంలో ప్రాక్టీస్‌ చేయాలన్న ఆలోచనే సవాల్‌తో కూడుకున్నది. కలలను సాకారం చేసుకోవాలంటే కష్టపడి పనిచేయాలి. నేను ఈ కోర్టుకు వచ్చేటప్పుడు ఇదే నా చివరి ప్రయాణం అనుకున్నాను. ఇక్కడ రాత్రింబవళ్లు శ్రమించి.. 60-65 ఏళ్లకు మళ్లీ హైదరాబాద్‌కు వెనక్కి వెళ్లి సమాజంలోని పేద పిల్లలకు సాయం చేయాలనుకున్నాను. 2014లో అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఆర్‌.ఎం.లోధా నాకు న్యాయమూర్తి పదవి ఇవ్వజూపారు. నేను తొలుత అంగీకరించాను. తర్వాత నా నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాను. అప్పటికే నేను చాలామంది పేద పిల్లల చదువులకు సాయం చేస్తున్నాను. సొంత ఊరిలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతున్నాను. వాటన్నింటినీ వదిలేయాల్సి వస్తుందన్న కారణంతోనే ఆ ఆఫర్‌ను తిరస్కరించాను. జస్టిస్‌ లోధా నా నిర్ణయాన్ని గౌరవించారు. 2016లో అప్పటి సీజేఐ జస్టిస్‌ టి.ఎస్‌.ఠాకుర్‌ నన్ను వారి ఇంటికి పిలిచి.. న్యాయమూర్తి పదవి చేపట్టాలని కోరారు. 'రెండేళ్ల క్రితం అంగీకరించి వద్దాన్నావు. అప్పట్లో కారణంగా చూపిన బాధ్యతలను తీర్చడానికి అవసరమైన డబ్బును ఇప్పుడు సంపాదించావు. కాబట్టి ఈసారి కచ్చితంగా అంగీకరించాల్సిందే' అని పట్టుబట్టారు. ఇంట్లో మాట్లాడి చెబుతానన్నా ఆయన వినలేదు. నాకు సమయం ఇస్తే ఒప్పుకోనేమోనని ఆయన భావించారు. 'నీవు 60-65 ఏళ్లకు వెనక్కి వెళ్లిపోవాలనుకుంటున్నావు కదా.. ఇప్పుడు న్యాయమూర్తి పదవి చేపడితే 65 ఏళ్లకు కచ్చితంగా బయటికెళ్లాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని స్వీకరించు' అని జస్టిస్‌ ఠాకుర్‌ కోరారు. అలా తప్పనిసరి పరిస్థితుల్లో న్యాయమూర్తి పదవి స్వీకరించడానికి నేను అంగీకరించాను."

న్యాయవాదిలా ఆలోచించా..
"నాకు ఈ వృత్తి.. జీవితంలో అన్నింటినీ ఇచ్చింది. న్యాయవాదిగా ఉండటానికి ఎప్పుడూ ఇష్టపడతాను. న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఓసారి.. 'నేను ఇప్పటికీ న్యాయవాదిగానే ఆలోచిస్తున్నానుతప్ప న్యాయమూర్తిలా కాదు' అని ధర్మాసనంపై కలిసి కూర్చున్న అప్పటి న్యాయమూర్తి జస్టిస్‌ గొగొయితో అన్నాను. అందుకు ఆయన స్పందిస్తూ.. 'నీవు న్యాయవాది తరహాలోనే ఆలోచించు. దానివల్ల న్యాయవాదులను మరింత మెరుగ్గా అర్థం చేసుకోవచ్చు' అన్నారు. జస్టిస్‌ గొగొయితో అన్న మాటలు నిన్న కోర్టులో కూర్చున్నప్పుడు కూడా నాకు గుర్తొచ్చాయి. నేను 22 ఏళ్లు బార్‌ సభ్యుడిగా ఉన్నాను. మీరు చూపిన ప్రేమ, ఆప్యాయత.. నా విధి నిర్వహణను చాలా సులభతరం చేశాయి. ఈ రోజుక్కూడా నేను ఇటువైపు (ధర్మాసనం) కంటే అటువైపే (న్యాయవాదులు) మేలని అనుకుంటున్నాను. అవకాశముంటే జీవితాంతం న్యాయవాదిగా కొనసాగుతాను. దిల్లీకొచ్చి ప్రాక్టీస్‌ మొదలుపెట్టిన తర్వాత ఎదురైన ఇబ్బందులన్నీ గుర్తున్నాయి. ఇది ఎంతో అద్భుతమైన ప్రయాణం. సహచర న్యాయవాదులు, న్యాయమూర్తుల నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఈ కోర్టులో నేను కఠినంగా వ్యవహరించి ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమాపణలు కోరుతున్నాను."

వృత్తి జీవితంలో నటన భాగం
"యుక్త వయస్సులో ఉన్నప్పుడు దర్శకుడిగా ఉన్న సోదరుడు నటించమని కోరడంతో ఒక సినిమాలో నటించాను. తర్వాత ఆపేశాను. కోర్టుల్లో వాదనలు వేడెక్కినప్పుడు న్యాయవాదుల మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నించే సమయంలో కొంత నటించాల్సి వస్తుంది. కాబట్టి వృత్తి జీవితంలో నటన అంతర్భాగం. క్రికెట్‌ నాకు ఇష్టమైన క్రీడ. నేను పనిచేసుకుంటున్నప్పుడు కూడా టీవీలో ఐపీఎల్‌ మ్యాచ్‌ నడుస్తూ ఉండాల్సిందే. అది జీవితంలో భాగంగా మారింది. పదేళ్ల నుంచి గోల్ఫ్‌ అలవాటైంది. క్రీడలు నాకు జీవితంలో ఎన్నో నేర్పాయి."

కష్టపడితేనే ముందుకు..
"అసాధారణ మేధస్సు, వేగంగా అన్నింటినీ అర్థం చేసుకొనే సామర్థ్యాలు నాకున్నాయని చెప్పను. నేను సాధారణ తెలివితేటలున్న వ్యక్తిని. 'కష్టపడి పనిచేస్తే ఉన్నత స్థానానికి చేరుకుంటావు' అని మా స్వరాష్ట్రానికి చెందిన దివంగత సీనియర్‌ న్యాయవాది పీపీ రావు ఓసారి నాతో చెప్పారు. ఆ మాట నాపై బాగా పనిచేసింది. న్యాయవాదులే రాజ్యాంగ కాపలాదారులు. బలమైన బార్‌ ఉన్నప్పుడే దాని సహకారంతో న్యాయమూర్తులు న్యాయం చేయగలుగుతారు. పౌరహక్కుల గురించి న్యాయవాదులు గొంతెత్తకపోతే.. దాని గురించి ఎక్కడా వినిపించుకొనే పరిస్థితి ఉండదు. ఇప్పటివరకూ పౌరుల హక్కులను కాపాడటంలో సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చింది. బార్‌ వల్ల నేను ఎంతో ప్రయోజనం పొందాను. నేను మిగతావారిలా 15-20 ఏళ్లు న్యాయమూర్తిగా పనిచేయలేదు. కాబట్టి పనిచేస్తూనే నేర్చుకున్నాను" అని జస్టిస్ లావు నాగేశ్వరరావు వివరించారు.

ఇదీ చదవండి:

CJI Ramana speech: సమాజానికి ఎంతో కొంత వెనక్కి ఇవ్వాలన్న సిద్ధాంతాన్ని బలంగా నమ్మి, దాన్ని ఆచరించిన గొప్ప వ్యక్తి సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు అని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ కొనియాడారు. ఆర్జన అధికంగా ఉన్న న్యాయవాద వృత్తిని వదిలి, దేశానికి సేవ చేసేందుకే ఆయన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారని పేర్కొన్నారు. ఆయన చేసిన త్యాగం అందరికీ సాధ్యం కాదని అన్నారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకోవాలని యువ న్యాయవాదులకు సూచించారు. జస్టిస్‌ నాగేశ్వరరావు వచ్చే నెల 7న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో వేసవి సెలవుల ముందు చివరి పనిదినమైన శుక్రవారం సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఆయనకు వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది. దానికి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జస్టిస్‌ నాగేశ్వరరావుతో తనకున్న అనుబంధాన్ని వివరించారు.

.

సీజేఐ మాట్లాడుతూ.. "ఇది చాలా భావోద్వేగపూరిత రోజు. నేను మంచి స్నేహితుడు, సలహాదారుడిని కోల్పోతున్నా. జస్టిస్‌ నాగేశ్వరరావు, నేను.. రెండు నెలల తేడాతో ఒకే ఏడాది గుంటూరులో జన్మించాం. ఆయన ఏసీ కళాశాలలో, నేను నాగార్జున విశ్వవిద్యాలయంలో చదుకున్నాం. చిన్నప్పటినుంచీ జస్టిస్‌ నాగేశ్వరరావు చాలా క్రమశిక్షణతో మెలిగారు. 1982 జులైలో ఆయన న్యాయవాదిగా చేరితే, 1983 జనవరిలో నేను ఆ వృత్తిని ప్రారంభించాను. జస్టిస్‌ నాగేశ్వరరావు గుంటూరు జిల్లా కోర్టులో ప్రాక్టీస్‌ మొదలుపెట్టి, తర్వాత హైకోర్టుకు మారారు. అక్కడ దిగ్గజ న్యాయవాది వై.సూర్యనారాయణ వద్ద జూనియర్‌గా చేరి తన సామర్థ్యాలను నిరూపించుకున్నారు. తర్వాత సాహసోపేతంగా దిల్లీకి మారారు. గాడ్‌ఫాదర్ల అండ లేకుండా ఇక్కడికొచ్చి ప్రాక్టీస్‌ చేసి విజయవంతమవడం సులభం కాదు. కానీ ఆయన దాన్ని సాధించి చూపారు. కఠోర శ్రమ, దయాగుణం, తెలివితేటలే ఆయన్ను గొప్ప న్యాయవాదిగా తీర్చిదిద్దాయి" అని పేర్కొన్నారు.

.

స్వతంత్ర న్యాయవాదిగా ఉండటమే ఇష్టం
జస్టిస్‌ నాగేశ్వరరావు రెండుసార్లు అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా పనిచేసి తనదైన ముద్ర వేశారని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ గుర్తుచేశారు. "రెండోసారి అదనపు సొలిసిటర్‌ జనరల్‌ పదవికి రాజీనామా చేసినప్పుడు.. 'ఎందుకు వైదొలిగారు? అందులోనే కొనసాగితే మంచి అవకాశాలు ఉంటాయి కదా?' అని ఆయన్ను అడిగాను. స్వేచ్ఛాయుత న్యాయవాదిగా తనదైన శైలిలో కేసులను వాదించాలనుకుంటున్నట్లు బదులిచ్చారు. న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన రెండేళ్ల తర్వాత హైదరాబాద్‌ వెళ్తున్నప్పుడు.. 'కొత్త బాధ్యతలు ఎలా ఉన్నాయి?' అన్న నా ప్రశ్నకు 'ఇంకా అలవాటుపడలేదు' అని జస్టిస్‌ నాగేశ్వరరావు సమాధానమిచ్చారు. ఆయన న్యాయమూర్తిగా ఉండటం కంటే స్వతంత్ర న్యాయవాదిగా ఉండటాన్నే ఇష్టపడ్డారు. అయినా జడ్జి బాధ్యతలను విస్మరించకుండా కష్టపడి పనిచేశారు. ధైర్యంగా, స్వతంత్రంగా తీర్పులిచ్చారు. సుప్రీంకోర్టులోనే కాకుండా దేశంలోని అన్ని ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయవాదిగా వాదనలు వినిపించిన ఘనత ఆయనకుంది" అని సీజేఐ పేర్కొన్నారు.

కీలక తీర్పులిచ్చారు
న్యాయ పరిధిని విస్తరించడంలో జస్టిస్‌ నాగేశ్వరరావు కీలక పాత్ర పోషించారని సీజేఐ ప్రశంసించారు. "మద్రాసు బార్‌ అసోసియేషన్‌ కేసు సహా పలు కేసుల్లో జస్టిస్‌ నాగేశ్వరరావు కీలక తీర్పులిచ్చారు. ట్రైబ్యునళ్లు బలహీనపడకుండా చూశారు. ఆర్డినెన్సులను పదేపదే జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని కృష్ణకుమార్‌ సింగ్‌ కేసులో తీర్పునిచ్చిన ఏడుగురు సభ్యుల ధర్మాసనంలోనూ ఆయన సభ్యుడు. ఎవరికీ బలవంతంగా టీకా ఇవ్వకూడదని, అలా చేయడం రాజ్యాంగంలోని అధికరణం-21కి విరుద్ధమని జస్టిస్‌ నాగేశ్వరరావు స్పష్టం చేశారు. వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ కల్పించడంలో భాగంగా అధికరణం-142ను ఉపయోగించి ఆజంఖాన్‌కు వినూత్న పద్ధతిలో బెయిలు మంజూరు చేశారు. దేశంలో క్రిమినల్‌ ట్రయల్స్, నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ యాక్ట్‌ కింద కేసుల విచారణను వేగవంతం చేయాలని చెప్పి.. అందుకు మార్గదర్శకాలు జారీ చేశారు" అని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ గుర్తుచేశారు.

బార్‌కు మేలిమి రత్నం
"జస్టిస్‌ నాగేశ్వరరావు పదవీ విరమణతో.. గొప్ప విశ్లేషణ శక్తి ఉన్న వ్యక్తిని మనం కోల్పోతున్నాం. ఆయన ఎదుగుదల యువ న్యాయవాదులు, న్యాయమూర్తులకు స్ఫూర్తి. హైదరాబాద్‌లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రం వ్యవస్థాపకుల్లో ఆయన ఒకరు. ఇకపై దానికి ఆయన నేతృత్వం వహిస్తారు. ఆయన నేతృత్వంలో అది ప్రపంచంలోని గొప్ప కేంద్రాల్లో ఒకటిగా నిలుస్తుందని ఆశిస్తున్నా. జస్టిస్‌ నాగేశ్వరరావు మంచి క్రికెటర్‌ కూడా. 1982లో రంజీ ట్రోఫీ ఆడారు. న్యాయవాదులు, న్యాయమూర్తుల క్రికెట్‌ జట్లకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆయన నేతృత్వంలోనే న్యాయమూర్తులు తొలిసారి కప్‌ గెలిచారు. ఆయన నటుడు, బైకర్‌. గోల్ఫ్‌ ఆటగాడు కూడా. కళలను చాలా ఇష్టపడతారు. పదవీ విరమణ తర్వాత వీటన్నింటినీ ఆస్వాదించడానికి ఆయనకు సమయం దొరుకుతుందని భావిస్తున్నా. జస్టిస్‌ నాగేశ్వరరావు ఎంతో సాత్వికుడు. 'కొందరు న్యాయవాదుల్లా కోర్టులో ఎప్పుడైనా గట్టిగా అరిచారా?' అని అని రెండు రోజులక్రితం అడిగినప్పుడు.. 'నేనెప్పుడూ అలా చేయలేదు. అలా అరిచేవారిని చూసి భయపడి పారిపోయేవాడిని' అని బదులిచ్చారు. జస్టిస్‌ నాగేశ్వరరావు కచ్చితంగా బార్‌కు మేలిమి రత్నంగా, అత్యంత అభిమానపాత్రుడైన సీనియర్‌ న్యాయవాదిగా మిగిలిపోతారు. యువ న్యాయవాదులు ఆయన్ను స్ఫూర్తిగా తీసుకోవాలి. తండ్రి లావు వెంకటేశ్వర్లు అడుగుజాడల్లో ఆయన సొంతూరును దత్తత తీసుకొని దాని అభివృద్ధికి బాటలు వేశారు" అని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ప్రశంసించారు.

పదవీకాలం కనీసం 7 ఏళ్లు ఉండాలి
దేశ సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తులుగా బాధ్యతలు చేపట్టేవారికి కనీసం 7-8 ఏళ్ల పదవీకాలం ఉండాలని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. అప్పుడే వారు ఉత్తమ పనితీరు కనబర్చగలరని పేర్కొన్నారు. అత్యున్నత న్యాయస్థానం జడ్జీల పదవీ విరమణ వయసు 65 ఏళ్లుగా ఉండటమంటే.. వారు తక్కువ వయసులో నిష్క్రమిస్తున్నట్లేనని వ్యాఖ్యానించారు. అవకాశముంటే జీవితాంతం న్యాయవాదిగా కొనసాగేందుకు తాను ఇష్టపడతానని చెప్పారు.

.

తాను వచ్చే నెల 7న పదవీ విరమణ చేయనుండటంతో.. తన గౌరవార్థం సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ శుక్రవారం ఏర్పాటుచేసిన వీడ్కోలు కార్యక్రమంలో జస్టిస్‌ నాగేశ్వరరావు ఈ మేరకు పలు కీలక అంశాలపై మాట్లాడారు. తన అనుభవాలను అందరితో పంచుకున్నారు. ఆయన ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే.. "హైకోర్టుల్లో 15-17 ఏళ్లు న్యాయమూర్తులుగా పనిచేసి సుప్రీంకోర్టుకు పదోన్నతిపై వచ్చేవారికి సగటున 4-5 ఏళ్ల పదవీకాలం మాత్రమే ఉంటుంది. ఇక్కడి పనితీరుకు అలవాటుపడటానికి వారికి రెండేళ్లు పడుతుంది. క్రమంగా అన్నింటినీ అర్థం చేసుకొని పూర్తిస్థాయిలో పనిచేయడం మొదలుపెట్టాక పదవీ విరమణ వయసు వచ్చేస్తుంది. పలువురు గతంలో న్యాయవాదులుగా పనిచేసినప్పటికీ.. తీర్పులు చెప్పడమనేది పూర్తిగా విభిన్నమైన కళ. అందులో పూర్తిస్థాయిలో ఆరితేరడానికి 3-4 ఏళ్ల సమయం పడుతుంది. కాబట్టి సుప్రీంకోర్టుకు వచ్చే న్యాయమూర్తులకు కనీసం 7-8 ఏళ్ల పదవీకాలం ఉండేలా చూడాలి. అప్పుడే వారు ఉత్తమ పనితీరు ప్రదర్శిస్తారు. నేనిక్కడ ఆరేళ్లుగా ఉన్నాను. ప్రతిరోజు కోర్టు వ్యవహారాలపై పట్టు పెంచుకున్నాను. సౌకర్యవంతంగా ఉండే స్థితికి రాగానే.. వెళ్లిపోతున్నాను. నిర్ణయాధికారం ఉన్నవారు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. పదవీకాలం ఎక్కువ ఉన్నవారిని ఇక్కడ న్యాయమూర్తిగా తీసుకోవాలి."

2014లోనే అవకాశం వచ్చినా..
"నేను దిల్లీకి మకాం మార్చేటప్పుడు మా కుటుంబసభ్యులతోపాటు స్నేహితుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అంతా బాగున్న హైకోర్టును వదులుకొని సుప్రీంకోర్టుకు వెళ్లడం ఎందుకని వారు ప్రశ్నించారు. అయితే మనం సవాళ్లను స్వీకరించకపోతే విజయం సాధించలేం. ఈ విషయాన్ని యువత గుర్తించాలి. సర్వోన్నత న్యాయస్థానంలో ప్రాక్టీస్‌ చేయాలన్న ఆలోచనే సవాల్‌తో కూడుకున్నది. కలలను సాకారం చేసుకోవాలంటే కష్టపడి పనిచేయాలి. నేను ఈ కోర్టుకు వచ్చేటప్పుడు ఇదే నా చివరి ప్రయాణం అనుకున్నాను. ఇక్కడ రాత్రింబవళ్లు శ్రమించి.. 60-65 ఏళ్లకు మళ్లీ హైదరాబాద్‌కు వెనక్కి వెళ్లి సమాజంలోని పేద పిల్లలకు సాయం చేయాలనుకున్నాను. 2014లో అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఆర్‌.ఎం.లోధా నాకు న్యాయమూర్తి పదవి ఇవ్వజూపారు. నేను తొలుత అంగీకరించాను. తర్వాత నా నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాను. అప్పటికే నేను చాలామంది పేద పిల్లల చదువులకు సాయం చేస్తున్నాను. సొంత ఊరిలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతున్నాను. వాటన్నింటినీ వదిలేయాల్సి వస్తుందన్న కారణంతోనే ఆ ఆఫర్‌ను తిరస్కరించాను. జస్టిస్‌ లోధా నా నిర్ణయాన్ని గౌరవించారు. 2016లో అప్పటి సీజేఐ జస్టిస్‌ టి.ఎస్‌.ఠాకుర్‌ నన్ను వారి ఇంటికి పిలిచి.. న్యాయమూర్తి పదవి చేపట్టాలని కోరారు. 'రెండేళ్ల క్రితం అంగీకరించి వద్దాన్నావు. అప్పట్లో కారణంగా చూపిన బాధ్యతలను తీర్చడానికి అవసరమైన డబ్బును ఇప్పుడు సంపాదించావు. కాబట్టి ఈసారి కచ్చితంగా అంగీకరించాల్సిందే' అని పట్టుబట్టారు. ఇంట్లో మాట్లాడి చెబుతానన్నా ఆయన వినలేదు. నాకు సమయం ఇస్తే ఒప్పుకోనేమోనని ఆయన భావించారు. 'నీవు 60-65 ఏళ్లకు వెనక్కి వెళ్లిపోవాలనుకుంటున్నావు కదా.. ఇప్పుడు న్యాయమూర్తి పదవి చేపడితే 65 ఏళ్లకు కచ్చితంగా బయటికెళ్లాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని స్వీకరించు' అని జస్టిస్‌ ఠాకుర్‌ కోరారు. అలా తప్పనిసరి పరిస్థితుల్లో న్యాయమూర్తి పదవి స్వీకరించడానికి నేను అంగీకరించాను."

న్యాయవాదిలా ఆలోచించా..
"నాకు ఈ వృత్తి.. జీవితంలో అన్నింటినీ ఇచ్చింది. న్యాయవాదిగా ఉండటానికి ఎప్పుడూ ఇష్టపడతాను. న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఓసారి.. 'నేను ఇప్పటికీ న్యాయవాదిగానే ఆలోచిస్తున్నానుతప్ప న్యాయమూర్తిలా కాదు' అని ధర్మాసనంపై కలిసి కూర్చున్న అప్పటి న్యాయమూర్తి జస్టిస్‌ గొగొయితో అన్నాను. అందుకు ఆయన స్పందిస్తూ.. 'నీవు న్యాయవాది తరహాలోనే ఆలోచించు. దానివల్ల న్యాయవాదులను మరింత మెరుగ్గా అర్థం చేసుకోవచ్చు' అన్నారు. జస్టిస్‌ గొగొయితో అన్న మాటలు నిన్న కోర్టులో కూర్చున్నప్పుడు కూడా నాకు గుర్తొచ్చాయి. నేను 22 ఏళ్లు బార్‌ సభ్యుడిగా ఉన్నాను. మీరు చూపిన ప్రేమ, ఆప్యాయత.. నా విధి నిర్వహణను చాలా సులభతరం చేశాయి. ఈ రోజుక్కూడా నేను ఇటువైపు (ధర్మాసనం) కంటే అటువైపే (న్యాయవాదులు) మేలని అనుకుంటున్నాను. అవకాశముంటే జీవితాంతం న్యాయవాదిగా కొనసాగుతాను. దిల్లీకొచ్చి ప్రాక్టీస్‌ మొదలుపెట్టిన తర్వాత ఎదురైన ఇబ్బందులన్నీ గుర్తున్నాయి. ఇది ఎంతో అద్భుతమైన ప్రయాణం. సహచర న్యాయవాదులు, న్యాయమూర్తుల నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఈ కోర్టులో నేను కఠినంగా వ్యవహరించి ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమాపణలు కోరుతున్నాను."

వృత్తి జీవితంలో నటన భాగం
"యుక్త వయస్సులో ఉన్నప్పుడు దర్శకుడిగా ఉన్న సోదరుడు నటించమని కోరడంతో ఒక సినిమాలో నటించాను. తర్వాత ఆపేశాను. కోర్టుల్లో వాదనలు వేడెక్కినప్పుడు న్యాయవాదుల మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నించే సమయంలో కొంత నటించాల్సి వస్తుంది. కాబట్టి వృత్తి జీవితంలో నటన అంతర్భాగం. క్రికెట్‌ నాకు ఇష్టమైన క్రీడ. నేను పనిచేసుకుంటున్నప్పుడు కూడా టీవీలో ఐపీఎల్‌ మ్యాచ్‌ నడుస్తూ ఉండాల్సిందే. అది జీవితంలో భాగంగా మారింది. పదేళ్ల నుంచి గోల్ఫ్‌ అలవాటైంది. క్రీడలు నాకు జీవితంలో ఎన్నో నేర్పాయి."

కష్టపడితేనే ముందుకు..
"అసాధారణ మేధస్సు, వేగంగా అన్నింటినీ అర్థం చేసుకొనే సామర్థ్యాలు నాకున్నాయని చెప్పను. నేను సాధారణ తెలివితేటలున్న వ్యక్తిని. 'కష్టపడి పనిచేస్తే ఉన్నత స్థానానికి చేరుకుంటావు' అని మా స్వరాష్ట్రానికి చెందిన దివంగత సీనియర్‌ న్యాయవాది పీపీ రావు ఓసారి నాతో చెప్పారు. ఆ మాట నాపై బాగా పనిచేసింది. న్యాయవాదులే రాజ్యాంగ కాపలాదారులు. బలమైన బార్‌ ఉన్నప్పుడే దాని సహకారంతో న్యాయమూర్తులు న్యాయం చేయగలుగుతారు. పౌరహక్కుల గురించి న్యాయవాదులు గొంతెత్తకపోతే.. దాని గురించి ఎక్కడా వినిపించుకొనే పరిస్థితి ఉండదు. ఇప్పటివరకూ పౌరుల హక్కులను కాపాడటంలో సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చింది. బార్‌ వల్ల నేను ఎంతో ప్రయోజనం పొందాను. నేను మిగతావారిలా 15-20 ఏళ్లు న్యాయమూర్తిగా పనిచేయలేదు. కాబట్టి పనిచేస్తూనే నేర్చుకున్నాను" అని జస్టిస్ లావు నాగేశ్వరరావు వివరించారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.