కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేయడంలో భాగంగా, వ్యాక్సిన్ పంపిణీని భారత్ వేగంగా చేపడుతోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఒక కోటికిపైగా (1,01,88,007) డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వ్యాక్సినేషన్ ప్రారంభించిన కేవలం 34 రోజుల్లో కోటి మార్కును దాటినట్లు పేర్కొంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ను వేగంగా చేపడుతోన్న దేశాల్లో అమెరికా ముందుండగా.. భారత్ రెండో స్థానంలో నిలిచినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
34 రోజుల్లోనే..
భారత్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ.. జవవరి 16న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైంది. దాదాపు 65లక్షల మంది వైద్యారోగ్య సిబ్బంది తొలి డోసు తీసుకోగా, వీరిలో 4లక్షల మందికి రెండో డోసు అందించారు. వీరితో పాటు మరో 30లక్షల మంది ఫ్రంట్లైన్ వర్కర్లకు కూడా టీకా ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కాగా, తొలి డోసు తీసుకున్న వారికి 28 రోజుల వ్యవధి అనంతరం రెండోడోసు (ఫిబ్రవరి 13నుంచి) పంపిణీ కొనసాగుతోంది.
రెండోస్థానంలో భారత్..
అమెరికాలో కేవలం 31రోజుల్లోనే పౌరులకు.. కోటి వ్యాక్సిన్ డోసులను అందించారు. ఆ దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభించి ప్రస్తుతం 66 రోజులు పూర్తికాగా, ఇప్పటివరకు ఐదున్నర కోట్ల డోసులను పంపిణీ చేశారు. ఇక బ్రిటన్లో వ్యాక్సినేషన్ ప్రారంభించి 56 రోజులు కాగా.. అక్కడ కోటి 65లక్షల మందికి టీకా పంపిణీ చేశారు. తాజాగా భారత్ 34 రోజుల్లో కోటి డోసుల మార్కును దాటింది.
ప్రపంచవ్యాప్తంగా 19కోట్లు..
ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ వేగంగానే కొనసాగుతోంది. అంతర్జాతీయ నివేదికల ప్రకారం.. ఇప్పటికే 82దేశాలు వ్యాక్సినేషన్ మొదలుపెట్టాయి. ఇప్పటి వరకు దాదాపు 19కోట్ల మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్లు సమాచారం. వ్యాక్సిన్ పంపిణీలో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, ఐరోపా సంఘం, బ్రిటన్లలోనూ ఈ ప్రక్రియ వేగంగానే కొనసాగుతోంది. అటు ఇజ్రాయెల్, బ్రెజిల్ దేశాలు వ్యాక్సినేషన్ను ముమ్మరంగా చేపడుతున్నాయి. అయితే, చైనాలోనూ వ్యాక్సినేషన్ భారీ స్థాయిలో చేపడుతున్నప్పటికీ, వాటికి సంబంధించిన అధికారిక సమచారం అందుబాటులో లేదు. ఇక కొవిడ్ వ్యాక్సిన్ను తొలిసారిగా రిజిస్టర్ చేసుకున్నట్లు ప్రకటించిన రష్యాలో మాత్రం ఈ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది.
ఇదీ చదవండి: ప్రైవేట్ భాగస్వామ్యంతోనే కొవిడ్ నియంత్రణ వ్యూహం