అరుదైన వివాహానికి రాజస్థాన్ కోటా జిల్లాలోని ఎస్బీఎస్ ఆస్పత్రి వేదికైంది. హాస్పిటల్లో చేరిన యువతిని వివాహం చేసుకునేందుకు ఓ యువకుడు ఊరేగింపుతో అక్కడికి వచ్చాడు. వారిద్దరి పెళ్లి కోసం ఆస్పత్రిలోనే ఒక గదిని బుక్ చేశారు. కుటుంబ సభ్యుల సమక్షంలో వారిద్దరూ ఆస్పత్రిలోనే వివాహం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..
కోటా జిల్లాలోని రామ్గంజ్ మండి ప్రాంతంలోని భావ్పురా నివాసి పంకజ్కు రావత్భటా నివాసి మధు రాఠోడ్తో శనివారం పెళ్లి జరగాల్సి ఉంది. కొన్ని రోజుల నుంచి ఇరువురి ఇళ్లలో వివాహ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వధువు వివాహ వేదికకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా మెట్లపై నుంచి జారిపడింది. ఆ ఘటనలో ఆమె రెండు చేతులు విరిగాయి. వధువు తలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. వధువు జారిపడిన విషయం చెప్పేలోపే వరుడి కుటుంబం పెళ్లి మండపానికి బయలుదేరిపోయింది.

పంకజ్ తండ్రి శివలాల్ రాఠోడ్, మధు తండ్రి రమేష్ రాఠోడ్ ఇద్దరూ ఈ విషయం గురించి మాట్లాడుకుని ఆస్పత్రిలోనే వివాహ వేడుకలను నిర్వహించాలని నిర్ణయించారు. వారిద్దరి పెళ్లి కోసం హాస్పిటల్లో ఒక గదిని బుక్ చేసి, దాన్ని అందంగా అలంకరించారు. వివాహ తంతు అంతా అక్కడే నిర్వహించారు. వధూవరులు ఒకరి మెడలో ఒకరు పూలమాలలు వేసుకున్నారు. తర్వాత మూడుముళ్ల బంధంతో ఇరువురూ ఒక్కటయ్యారు. వధువు నడవలేని కారణంగా ఏడడుగులు వేయలేదు. ప్రస్తుతం వధువు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.


