టూల్కిట్ కేసులో బెంగళూరుకు చెందిన దిశ రవి అనే 21 ఏళ్ల పర్యావరణ కార్యకర్తను దిల్లీ సైబర్ సెల్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఆమెను మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా 5 రోజుల పోలీసు కస్టడీకి అనుమతించారు. సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు మద్దతు తెలిపేందుకు రూపొందించిన టూల్కిట్ను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసినందుకుగానూ దిశ రవిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు.
ఇదీ చదవండి: గ్రెటా 'నిరసనల కుట్ర'పై దిల్లీ పోలీసుల కేసు
ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ పేరిట పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వారిలో దిశ రవి కూడా ఉన్నారు. స్వీడన్కు చెందిన పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్బర్గ్ సహా పలువురు ప్రముఖులు షేర్ చేయగా టూల్కిట్ వెలుగులోకి వచ్చింది. రైతుల ఆందోళనకు మద్దతు తెలిపేందుకు ఉన్న మార్గాలను సూచిస్తూ గూగుల్ డాక్యుమెంట్ సృష్టించారు. దానికి టూల్కిట్గా నామకరణం చేశారు.
ఇదీ చదవండి: రైతుల ఆందోళనలకు గ్రెటా, రిహానా మద్దతు
అయితే ఖలిస్థాన్ వేర్పాటువాదులే టూల్కిట్ను రూపొందించారన్న ఆరోపణలు ఉన్నాయి. గుర్తు తెలియని వ్యక్తులపై దిల్లీ పోలీసులు దేశద్రోహం, ప్రభుత్వంపై కుట్రకు సంబంధించి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ కేసులో భాగంగానే దిశ రవిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: 'గ్రెటా, రిహానా మద్దతిస్తే తప్పేంటి?'
దేశంలో వివిధ వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, ప్రభుత్వంపై వ్యతిరేకతను సృష్టించడమే లక్ష్యంగా టూల్కిట్ను రూపొందించినట్లు పోలీసులు భావిస్తున్నారు. జనవరి 26న ఎర్రకోటపై ఇతర జెండాల ఎగరవేత, సామాజిక మాధ్యమాల్లో హ్యాష్ట్యాగ్ ద్వారా డిజిటల్ దాడి, భౌతిక దాడులకు సంబంధించిన ప్రస్తావన టూల్కిట్లో ఉన్నాయని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు ఈ కేసును తీవ్రంగా పరిగణిస్తున్నారు.