యోగాను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు 5 నిమిషాల యోగా బ్రేక్ (వై-బ్రేక్)ను(yoga break) ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వ విభాగాలను కోరింది. పని ప్రదేశంలో ఉద్యోగుల్లో ఒత్తిడి తగ్గించి పునరుత్తేజానికి, సామర్థ్యం పెంపును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిబ్బంది వ్యవహారాల శాఖ తెలిపింది. ఈ మేరకు అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది.
ఆయుష్ మంత్రిత్వ శాఖలోని నిపుణుల కమిటీ 2019లో 'వై-బ్రేక్' పేరుతో 5 నిమిషాల నిడివి గల యోగా ప్రోటోకాల్ను(5 minute yoga protocol) రూపొందించింది. దేశవ్యాప్తంగా ఆరు మెట్రో నగరాలు దిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతాలో పైలట్ ప్రాజెక్టును 2020 జనవరిలో ప్రారంభించారు. ఆయా నగరాల్లో మంచి స్పందన వచ్చినట్లు కేంద్రం తెలిపింది.
పైలట్ ప్రాజెక్ట్ ఫలితాల ఆధారంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆండ్రాయిడ్ ఆధారిత వై-బ్రేక్ యాప్ను(yoga break app) రూపొందించినట్లు సిబ్బంది వ్యవహారాల శాఖ తెలిపింది. ఆ యాప్ను ఇటీవలే గూగుల్ ప్లేలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది. వై-బ్రేక్ యాప్పై అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాల్లోని ఉద్యోగుల్లో అవగాహన కల్పించి పాటించేలా చూడాలని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: ఈ ఆసనాలతో అలసట మాయం.. ఉత్సాహం ఖాయం!