దేవుడి మాన్యంలో పండిన పంటను విక్రయించబోయిన ఓ దేవాలయ అర్చకుడికి వింత అనుభవం ఎదురైంది. దేవుడి ఆధార్ కార్డు ఇస్తేనే ధాన్యం కొనుగోలు జరుగుతుందని అధికారులు చెప్పడం వల్ల అర్చకుడు అవాక్కయ్యాడు. ఈ విచిత్ర సంఘటన ఉత్తర్ప్రదేశ్లోని కుర్హార గ్రామంలో జరిగింది.
గ్రామంలోని రామ్ జానకి ఆలయానికి మహంత్ రామ్కుమార్ దాస్ ప్రధాన అర్చకుడు. అలాగే దేవుడి పేరుమీద ఉన్న ఏడు హెక్టార్ల పంటభూమికి బాధ్యుడు. ఆ పొలంలో పండిన 100 క్వింటాళ్ల గోధుమలను విక్రయించడానికి రెండ్రోజుల కిందట ప్రభుత్వ మార్కెట్కి వెళ్లాడు. పంట కొనుగోలుకు ముందు అధికారులు భూయజమాని వివరాలను ఆన్లైన్లో రిజిస్ట్రర్ చేసుకుంటారు. ఈ క్రమంలో మహంత్ రామ్ కుమార్ను కూడా భూయజమాని వివరాలు అడిగారు. అది దేవుడి మాన్యం అని చెప్పగా.. భూమి ఎవరు పేరుపై ఉందో.. వారి ఆధార్ కార్డు ఉంటేనే పంట కొనుగోలు వీలు అవుతుందని స్పష్టం చేశారు. దేవుడికి ఆధార్ కార్డు లేకపోయేసరికి మాన్యం పంట కొనుగోలు ప్రక్రియను అధికారులు రద్దు చేశారు.
అధికారుల తీరుతో కంగుతిన్న అర్చకుడు.. దేవుడి ఆధార్ కార్డు ఎక్కడి నుంచి తేవాలంటూ తలపట్టుకున్నాడు. కొన్ని సంవత్సరాలుగా దేవుడి మాన్యంలో పండిన పంటను ప్రభుత్వ మార్కెట్లోనే విక్రయిస్తున్నానని, ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని చెప్పాడు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్లగా.. దేవాలయాలు, మఠాలకు సంబంధించిన పంట ఉత్పత్తులను కొనుగోలు చేయకూడదన్న నిబంధనలు ఉన్నాయని తెలిపారు. గతంలో ఉన్న ప్రభుత్వ విధానాలతో అర్చకుడు పంటను విక్రయించి ఉండొచ్చు.. కానీ, ఇప్పుడు భూమి ఎవరు పేరుపై ఉంటే వారి ఆధార్ కార్డు కచ్చితంగా సమర్పించాలని, అప్పుడే ప్రభుత్వం పంట కొనుగోలు చేస్తుందని వెల్లడించారు. దీంతో చేసేదేమీ లేక మహంత్ రామ్కుమార్ మార్కెట్ నుంచి వెనుదిరిగాడు. దళారులకే తక్కువ ధరకు పంటను విక్రయించాల్సి వస్తుందని వాపోయాడు.
ఇదీ చదవండి : టీకా తీసుకున్న వారిలో అయస్కాంత శక్తి- నిజమెంత?