తృణమూల్ కాంగ్రెస్పై.. బంగాల్ మాజీ మంత్రి సువేంధు అధికారి మరోసారి తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. 21ఏళ్ల పాటు ఆ పార్టీలో భాగమైనందుకు నిజంగా సిగ్గు పడుతున్నానని తెలిపారు. అంతేకాక, టీఎంసీ ఒక కంపెనీ అని.. పార్టీలో అసలు క్రమశిక్షణకు తావులేదన్నారు.
21ఏళ్లుగా ఆ(టీఎంసీ) పార్టీలో భాగమైనందుకు సిగ్గుపడుతున్నా. ఆ పార్టీలో క్రమశిక్షణ అసలు ఉండదు. అదొక కంపెనీ లాంటిది. ఇటీవలే నేను ఆ కంపెనీ నుంచి బయటికొచ్చి.. సరైన రాజకీయ పార్టీలో చేరాను. తృణమూల్ పాలన 'పార్టీ కోసం' మాత్రమే అనే సంస్కృతిని బంగాల్ ప్రజలకు అలవర్చింది. అంతకు ముందు 34 ఏళ్లపాటు రాష్ట్రాన్ని ఏలిన సీపీఐ-ఎం నేతృత్వంలోని ప్రభుత్వానికి మమతా పాలన కొనసాగింపు.
-సువేందు అధికారి, బంగాల్ మాజీ మంత్రి.
భాజపా మాత్రమే 'ప్రజల కోసం' అనే సంస్కృతిని అలవర్చుకుందని సువేందు తెలిపారు. మనకు నిజమైన ఆర్థిక సంస్కరణలు కావాలన్నా.. ఉద్యోగ అవకాశాలు రావాలన్నా.. కమలం పార్టీతో కలిసి సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. బంగాల్లోనూ తప్పకుండా ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్తో కలిసి సువేందు.. రాష్ట్రంలో మరణించిన 135మంది కాషాయ కార్యకర్తలకు నివాళులు అర్పించారు. 'సోనార్ బంగ్లా' అనే నినాదం వైపు రాష్ట్రాన్ని నడిపించాలని కమలం కార్యకర్తలను ఆయన కోరారు.