గ్రామస్థులంతా ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు. ఇంతలో తన ఇంటి నుంచి సర్వేశ్ కుమార్ బయటకు వచ్చాడు. పోలీస్ స్టేషన్ వైపు అడుగులు వేస్తున్న అతడిని చూసి గ్రామం అంతా ఉలిక్కి పడింది. అతని రాక్షసత్వాన్ని చూసి ఎవరికీ నోట మాట రాలేదు. పరువు కోసం కన్న కూతురినే హత్య చేసి ఆమె తలతో వీధిలోకి వచ్చాడు నిందితుడు. ఈ అమానుష ఘటన ఉత్తర్ప్రదేశ్లోని హర్దోయ్ జిల్లా పాండేయ తార గ్రామంలో బుధవారం జరిగింది.
ఎందుకీ దారుణం?
నిందితుడు సర్వేశ్కుమార్ కుమార్తె నీలమ్ (16).. బంధువైన ఆదేశ్ అనే యువకుడిని ప్రేమించింది. రెండు రోజుల క్రితం వీరిద్దరూ సన్నిహితంగా కలిసి తిరగడం నిందితుడి కంట పడింది. వారి ప్రేమ వ్యవహారం తెలుసుకున్న సర్వేశ్ కుమార్ మృగంగా మారాడు. పరువు ముందు కుమార్తె జీవితం గురించి ఆలోచించలేదు. ప్రేమికులను కడ తేర్చాలని నిర్ణయించుకున్నాడు. ఎవరూ లేని సమయం కోసం ఎదురు చూశాడు. బుధవారం నాడు ఇంట్లో ఒంటరిగా ఉన్న నీలమ్ తలనరికి చంపాడు. ఆ తర్వాత ఆమె శిరస్సును మొండెం నుంచి వేరు చేసి.. ఆ తలతో పోలీస్ స్టేషన్ బాట పట్టాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు దారిలోనే నిందితుడిని అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
ఇదీ చదవండి : 'టీకా ధ్రువపత్రంపై మోదీ చిత్రం అధికార దుర్వినియోగమే'