Family Reaches Hospital With Tantrik: సమాజంలో ఎన్నో మార్పులు వస్తున్నా.. ఇప్పటికీ ఎక్కడో చోట మూఢనమ్మకాలను జనం విశ్వసిస్తూనే ఉన్నారు. సినిమాల్లోనూ ఇలాంటివి చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఘటనే రాజస్థాన్ అజ్మేర్లోని ఓ ఆస్పత్రి ముందు కనిపించింది. ఎప్పుడో 13 ఏళ్ల కిందట చనిపోయిన కుమారుడి ఆత్మను బంధించాలని తాంత్రికుడితో సహా ఆస్పత్రి ముందు ప్రత్యక్షమైంది ఓ కుటుంబం. పిల్లల వార్డు బయట.. హడావుడిగా పూజలు చేస్తూ కనిపించారు మృతుడి కుటుంబసభ్యులు. ఏం చేస్తున్నారో తెలుసుకోవాలని.. జనం భారీగా గుమిగూడారు.


అసలేమైందో వారు చెప్పింది వింటే సినిమా కథలా ఉందనక మానరు. చనిపోయిన పిల్లాడు ఆత్మలా మారి తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాడని చెప్పుకొచ్చారు ఆ ఇంటి పెద్ద నాథూలాల్. ఏం చేయాలో తెలియక తాంత్రికుడిని తీసుకొచ్చినట్లు వెల్లడించారు.
'మా మనవడు పప్పూ కొన్నేళ్ల కిందట చనిపోయాడు. అనారోగ్యంతో జేఎల్ఎన్ ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత మా కుటుంబం కష్టాల్లో మునిగిపోయింది. కొన్నిసార్లు పంటలు నాశనమయ్యాయి. కొన్నిసార్లు పశువులు చనిపోయాయి. కుటుంబంలో అంతా తరచూ అస్వస్థతకు గురవుతున్నారు.'' అని చెప్పారు.
ఆస్పత్రి ముందు పూజలు చేస్తున్నా.. ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదు. పోలీసులు, వైద్యులు కూడా పెద్దగా పట్టించుకోలేదు. కొద్దిసేపటి అనంతరం వారంతా తిరిగి తమ గ్రామానికి వెళ్లారు.
ఇవీ చూడండి: మంత్రి కోడలు ఆత్మహత్య! ఆ వ్యవహారమే కారణం!!