దేశీయ రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా డీఆర్డీఓ కీలక ముందడుగు వేయనుంది. గగనతలంలో నిఘాను పెంచే 'వాయుమార్గ ముందస్తు హెచ్చరిక, నియంత్రణ విమానాల(ఏఈడబ్ల్యూసీ)'ను తయారు చేయనుంది. ఇవి అందుబాటులోకి వస్తే చైనా, పాకిస్థాన్ సరిహద్దులో భారత వాయుసేన నిఘా సామర్థ్యాలు మరింత మెరుగుపడతాయి.
రూ. 10,500 కోట్ల భారీ ప్రాజెక్టు కింద ఏఈడబ్ల్యూసీ బ్లాక్ 2 ఎయిర్క్రాఫ్ట్లను డీఆర్డీఓ అభివృద్ధి చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆరు విమానాలను ఎయిరిండియా నుంచి సేకరించి.. రాడార్తో ప్రయాణించేలా మార్పులు చేయనున్నట్లు వెల్లడించాయి. 360 డిగ్రీల కోణంలో నిఘా ఉంచే విధంగా భద్రతా దళాలకు ఈ విమానాలు ఉపయోగపడతాయని స్పష్టం చేశాయి.
త్వరలో ఆమోదం
ఇప్పుడున్న నెట్రా(నెట్వర్క్ ట్రాఫిక్ అనాలసిస్) వ్యవస్థతో పోలిస్తే ఏఈడబ్ల్యూసీ సామర్థ్యం మెరుగ్గా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. శత్రుదేశాల భూభాగాలపై 360 డిగ్రీల కోణంతో నిఘా వేసే అవకాశం దీని ద్వారా లభించనుందని వెల్లడించాయి. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం త్వరలోనే ఆమోదించే అవకాశం ఉన్నట్లు చెప్పాయి.
ఎయిరిండియా నుంచే విమానాలను తీసుకుంటున్న నేపథ్యంలో యూరోపియన్ సంస్థ నుంచి ఎయిర్బస్ 330 ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్లను కొనుగోలు చేయాలన్న నిర్ణయాన్ని విరమించినట్లు తెలిపారు అధికారులు. యూరోపియన్ సంస్థ నుంచి విమానాలను కొనుగోలు చేసి బెంగళూరులో అభివృద్ధి చేయాలని తొలుత భావించినట్లు చెప్పారు. అయితే తాజా ప్రణాళిక.. మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ను ప్రోత్సహించేలా రూపొందించినట్లు స్పష్టం చేశారు.