Delhi Police Raising Day Amit Shah: కరోనా సమయంలో దిల్లీ పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొనియాడారు. దిల్లీ పోలీస్ సిల్వర్ జూబ్లీ రైజింగ్ డే పరేడ్లో పాల్గొన్న ఆయన.. అనేక ఉగ్ర దాడుల యత్నాన్ని దిల్లీ పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. 2020 నాటి ఈశాన్య దిల్లీ అల్లర్ల కేసు దర్యాప్తును న్యాయబద్ధంగా, కఠినంగా సాగిస్తున్నందుకు పోలీసులకు అభినందనలు తెలిపారు.
![Delhi Police Raising Day Amit Shah](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14481097_amit-1.jpg)
North East Delhi riots Amit shah
ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణపై దిల్లీ పోలీసులు దృష్టిసారించాలని అమిత్ షా పిలుపునిచ్చారు. వచ్చే ఐదేళ్లతో పాటు, 25 ఏళ్లకు రోడ్మ్యాప్ను సిద్ధం చేసుకొని ముందుకు సాగాలని సూచించారు.
![Delhi Police Raising Day Amit Shah](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14481097_amit-3.jpg)
"ఈశాన్య దిల్లీ అల్లర్లు, కరోనా మహమ్మారి సమయంలో పోలీసులు సమర్థంగా పనిచేశారు. అల్లర్ల కేసును దర్యాప్తు చేసి, కోర్టులో ఆధారాలు ప్రవేశపెట్టిన తీరు అభినందనీయం. దిల్లీ పోలీసులు చాలా సవాళ్లు ఎదుర్కొంటున్నారు. ప్రముఖులకు భద్రత కల్పిస్తూ.. దిల్లీలో వివిధ కార్యక్రమాలు ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగేలా పనిచేస్తున్నారు. కాలంతో పాటు దిల్లీ పోలీసు శాఖ మారుతూ వస్తోంది. ఇలాగే వచ్చే ఐదేళ్లు, 25 ఏళ్లకు సంబంధించి చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రణాళిక రూపొందించుకోవాలి."
-అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
అంతర్జాతీయ స్థాయిలో ఏ కార్యక్రమం జరిగినా.. దాని ప్రభావం దిల్లీలో ఉంటుందన్నారు షా. అనుక్షణం పరిస్థితిని సమీక్షించుకుంటూ పోలీసులు పనిచేయాలని అన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన పర్సెప్షన్ మేనేజ్మెంట్ సెల్ ద్వారా.. నగర పోలీసులపై ప్రజల్లో సదాభిప్రాయం మరింత పెరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో భాగంగా మెరుగైన పనితీరు ప్రదర్శించిన పోలీసులకు మెడల్స్ అందించారు అమిత్ షా.
![Delhi Police Raising Day Amit Shah](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14481097_amit-2.jpg)
ఇదీ చదవండి: ప్రధాని మోదీ చెక్క భజన.. గురు రవిదాస్ ఆలయంలో...