హిండన్ నదిలో కాలుష్యాన్ని తగ్గించేందుకు పటిష్ఠ చర్యలు తీసుకోనందుకు ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వాన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్ తప్పుబట్టింది. కాలుష్యంతో కలిగే నష్టం తీవ్రమైన నేరాల వల్ల కలిగే నష్టానికి తక్కువేమి కాదని వ్యాఖ్యానించింది. కార్యనిర్వాహక విభాగాలు రాజ్యాంగపరమైన బాధ్యతలను నిర్వహించలేనప్పుడు వరుస ఆదేశాలు ఇచ్చినా ప్రయోజనం ఉండదని జస్టిస్ ఎ.కె.గోయల్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. కాళీ, కృష్ణా, హిండన్ నదుల కాలుష్యం కారణంగా పరిసర ప్రాణులు మరణిస్తున్నాయని ఎన్జీవో దోబా పర్యావరణ్ సమితి దాఖలు చేసిన పిటిషన్పై ఎన్జీటీ విచారణ జరిపింది.
రాజ్యాంగపరమైన బాధ్యతలను నిర్వర్తించడంలో రాష్ట్ర యంత్రాంగం విఫలమైందని చెప్పడం విచారకరం. సమస్యకు పరిష్కార మార్గాలను వెతకకుండా..కేవలం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడమే అసలు సమస్యకు దారితీస్తుంది. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ జోక్యంతో వివిధ శాఖల మధ్య సమన్యయంతో కాలుష్య నివారణకు వేగవంతమైన చర్యలు తీసుకోవాలి. అధికారులకు బాధ్యతలను అప్పగించాలి. అందులో విఫలమైన అధికారుల జాబితాను, గతంలో ఈ బాధ్యతలు అప్పగించిన అధికారుల రికార్డులు, కేటాయించిన నిధుల రికార్డులు నమోదు చేయాలి.
-ఎన్జీటీ
హిండన్ నది పరిశుభ్రతకు తీసుకుంటున్న ప్రణాళికలను నది పునరుద్ధరణ కమిటీ అధ్యక్షుడు పర్యవేక్షించాలని ఎన్జీటీ ఆదేశించింది.
ఇదీ చదవండి: ఉత్తరాఖండ్లో పెను ప్రమాదం- 150 మంది మృతి!