కంటికి కనిపించని కరోనా వైరస్తో ప్రపంచమంతా పోరాడుతోంది. ఎన్నో రంగాలను కుదిపేసిన, ఎందరి జీవితాలనో బలి తీసుకున్న ఆ వైరస్ రూపం ఎలా ఉంటుందో.. శాస్త్రవేత్తలు కొన్ని ఊహా చిత్రాలను విడుదల చేశారు. కొమ్ములతో కిరీటంలా ఉంటుందని చెప్పారు. ప్రపంచమంతా కొవిడ్ అనగానే అదే రూపాన్ని గుర్తుకు తెచ్చుకుంటుంది. ఇప్పుడు అచ్చం కరోనా వైరస్ను పోలి ఉన్నట్లుగా ఒడిశాలోని ఓ రైతు పొలంలో దోసకాయ కాసింది. దాంతో దాన్ని చూసేందుకు జనం ఎగబడుతున్నారు.
కాయపై కొమ్ములతో..
నవరంగ్పుర్ జిల్లాకు(Odisha nabarangpur) చెందిన సారగూడ గ్రామానికి చెందిన రవి కిరణ్ నాగ్ అనే రైతు పొలంలో ఈ వింత దోసకాయ కాసింది. అన్ని దోసకాయలు మామూలుగానే ఉండగా... ఈ ఒక్కటి మాత్రం విభిన్నంగా ఉంది. కరోనా వైరస్కు ఉన్నట్లుగానే దీనిపై కొమ్మలు ఉన్నాయి. దాంతో ఈ దోసకాయ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. 'కరోనా కాయ' అని పిలుచుకుంటూ నెటిజన్లు దీన్ని తెగ షేర్ చేస్తున్నారు. అంతేకాదు.. ఈ కాయను కళ్లారా చూసేందుకు చాలా మంది తమ పొలం వద్దకు కూడా వస్తున్నారని చెబుతున్నారు రైతు రవి కిరణ్.
"కూలీలకు డబ్బులు ఇచ్చేందుకు నేను పొలం వద్దకు వెళ్లాను. అక్కడి దోస తోటలో ఒక కాయ ఇలా కరోనా వైరస్ రూపంతో కనిపించింది. నేను దీన్ని చూసి, చాలా ఆశ్చర్యపోయాను. అనంతరం ఆ దోసకాయ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాను. అవి చూసి చాలా మంది.. ఈ దోసకాయను చూసేందుకు మా పొలం వద్దకు వస్తున్నారు. దానితో ఫొటోలు దిగుతున్నారు" అని రైతు రవి కిరణ్ నాగ్ తెలిపారు.
ఇదీ చూడండి: కరోనా చెవిలీలు: దర్జాగా వైరస్ను ధరించండి!