మధ్యప్రదేశ్ ఖండ్వా జిల్లాలోని బంజారీ గ్రామంలో పోలీసులు విచక్షణ కోల్పోయి గ్రామస్థుల పట్ల క్రూరంగా ప్రవర్తించారు. పలువురిని చితకబాదారు. అడ్డొచ్చిన మహిళలపైనా లాఠీ ఝుళిపించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. వీడియోలో కనిపిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
ఇదే కారణం!
ఛాయ్గావోమకాన్ పోలీస్స్టేషన్ పరిధిలోని బంజారీ గ్రామంలో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్థరణ అయిందన్న కారణంగా.. ఆరోగ్య కార్యకర్తలపై గ్రామస్థులు దాడి చేశారని పోలీసులు తెలిపారు. వివాదాన్ని అదుపు చేసేందుకు తాము వెళ్తే.. తమపైనా గ్రామస్థులు రాళ్లు రువ్వారని.. అందుకే లాఠీఛార్జి చేయాల్సివచ్చిందన్నారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ వివేక్ సింగ్ తీవ్రంగా స్పందించారు. గణపత్ కనేల్, ఆకాశ్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి : అవయవదానంపై చైతన్యానికి 700 కిమీ సైకిల్ యాత్ర