దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. రూ.5 చెల్లించి ప్రజలు కాంగ్రెస్ సభ్యత్వం పొందవచ్చని.. డిజిటల్ రూపంలోనూ మెంబర్షిప్ను అందుకోచ్చని వెల్లడించింది. ఈ కార్యక్రమం మార్చి 31 వరకు కొనసాగనుంది. 'కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం తీసుకోవాలనుకునే వారు మద్యం, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉన్నట్లు ధ్రువీకరించాలని.. పార్టీ విధానాలను బహిరంగ వేదికలపై విమర్శించబోమని హామీ ఇవ్వాల్సి ఉంటుందని' పార్టీ స్పష్టం చేసింది. అలాగే అన్ని వర్గాల ప్రజలు పార్టీలో చేరేలా చూడాలని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులకు సూచించింది.
ఈ సందర్భంగా "జాయిన్ కాంగ్రెస్-సేవ్ఇండియా" అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది కాంగ్రెస్. 'రాజ్యాంగ విలువలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్న శక్తుల నుంచి దేశాన్ని రక్షించేందుకు పార్టీలో చేరాలని' విజ్ఞప్తి చేసింది.
"భాజపా విద్వేషాన్ని వ్యాపింపజేస్తోంది. సమాజాన్ని విడదీస్తోంది. వీటిపై మహాత్మాగాంధీ బోధనలైన అహింస, సత్యం, ఐక్యతతో పోరాడదాం."
-కాంగ్రెస్
పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ ముగిసిన అనంతరం.. వచ్చే ఏడాది జులై 21-ఆగస్టు 20 మధ్య సంస్థాగత ఎన్నికలు, ఆగస్టు 21-సెప్టెంబరు 20 మధ్య కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది.
మరోవైపు.. పెరుగుతున్న ధరలపై దేశవ్యాప్తంగా 'జన్ జాగరణ్ అభియాన్' పేరిట నవంబర్ 14-29 వరకు ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది.
ఇవీ చదవండి: