మరికొద్ది నెలల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న బంగాల్లో రాజకీయ పార్టీలు శరవేగంగా సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న భాజపా.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా వేగం పెంచింది. వామపక్షాలతో పొత్తు కుదుర్చుకుంది. మొత్తం 294 స్థానాలకు గానూ 193 సీట్లకు.. హస్తం పార్టీ- లెఫ్ట్ కూటమి మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయింది. ఈ మేరకు కాంగ్రెస్ రాష్ట్రశాఖ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌధురీ గురువారం వెల్లడించారు.
ఈ 193 సీట్లలో వామపక్ష కూటమి 101 చోట్ల, కాంగ్రెస్ 92 స్థానాల్లో పోటీ చేసేందుకు ఇరు పార్టీల మధ్య అంగీకారం కుదిరింది. మిగతా 101 స్థానాలపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు అధీర్ రంజన్ తెలిపారు. 2016 ఎన్నికల్లో కాంగ్రెస్ 44 చోట్ల, వామపక్ష కూటమి 33 చోట్ల విజయం సాధించింది. ఈ సందర్భంగా అధీర్ రంజన్ మాట్లాడుతూ.. అధికార తృణమూల్ కాంగ్రెస్, భాజపా పార్టీలు రాష్ట్రంలో సంకుచిత రాజకీయాలను ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో తమ కూటమి.. ఆ రెండు పార్టీలకు గట్టి పోటీనిస్తుందని తెలిపారు.
ఇదీ చూడండి: సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ బంగాల్ అసెంబ్లీ తీర్మానం