బంగాల్ ఎన్నికల అనంతరం భాజపాను వీడి సొంతగూటికి చేరిన ఎమ్మెల్యే ముకుల్ రాయ్కు వీఐపీ భద్రతను కేంద్రం తొలగించింది. ఈ మేరకు రాయ్కు అందిస్తున్న జెడ్ కేటగిరీ భద్రతా విధుల నుంచి వైదొలగాల్సిందిగా కేంద్ర హోంశాఖ సీఆర్పీఎఫ్ను ఆదేశించింది. అలాగే రాయ్ కుమారుడు సుబ్రంగ్షుకు సీఐఎస్ఎఫ్ అందిస్తున్న భద్రతను సైతం ఉపసంహరించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఈ ఏడాది బంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయనకు సీఆర్పీఎఫ్ భద్రతను ఏర్పాటు చేసింది కేంద్రం. 22-24 మంది సాయుధలైన కమాండోలు ఆయన వెంట ఉండేవారు.
అయితే... తనకు వీఐపీ భద్రత అవసరం లేదని కేంద్రానికి ముకుల్ రాయ్ లేఖ రాశారని, అందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సమాచారం.
వీడిన వారంలోపే..!
ముకుల్ రాయ్ తన కుమారుడు సుబ్రంగ్షుతో కలిసి గతవారమే బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో టీఎంసీలో చేరారు. కృష్ణానగర్ ఉత్తర నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరికి ప్రస్తుతం రాష్ట్ర పోలీసులు భద్రత కల్పిస్తున్నారు.
ఇవీ చదవండి: టీఎంసీలోకి తిరిగొచ్చిన ముకుల్ రాయ్