'రాజీవ్ గాంధీ ఫౌండేషన్' విరాళాలపై కేంద్రం సంస్థాగత విచారణకు ఆదేశించటంపై భాజపా, కాంగ్రెస్ మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. ఈ విషయంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత విమర్శలు గుప్పించగా.. భాజపా ప్రతిదాడికి దిగింది.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి సత్యం గురించి మాట్లాడే అర్హత లేదని భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా తీవ్ర స్థాయిలో విమర్శించారు.
"రాహుల్ జీ, కుటుంబం మొత్తం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ వారికి సత్యం గురించి మాట్లాడే అర్హత లేదు. మీరు (రాహుల్, సోనియా) తప్పు చేయనప్పుడు బెదిరించినట్టు ఎలా భావిస్తారు? నిజమే.. ప్రధాని మోదీ నిజాయతీ వెలకట్టలేనిది. మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరికి ఓ ధర ఉంది. అది కూడా చౌకగానే.."
- సంబిత్ పాత్రా, భాజపా అధికార ప్రతినిధి
విచారణకు ఆదేశం..
రాజీవ్ గాంధీ ఫౌండేషన్లో చట్టాల ఉల్లంఘనలంటూ వస్తున్న ఆరోపణలపై విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది కేంద్ర హోంశాఖ. మనీ ల్యాండరింగ్ నియంత్రణ చట్టం, విదేశీ విరాళాల ఆరోపణలపై రాజీవ్ ఫౌండేషన్ సహా రాజీవ్ ఛారిటబుల్ ట్రస్ట్, ఇందిరా మెమోరియల్ ట్రస్టులపైనా విచారణ చేపట్టేందుకు కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు హోంశాఖ అధికార ప్రతినిధి బుధవారం ప్రకటన విడుదల చేశారు.
ఇదీ చూడండి: 'మోదీ జీ.. బెదిరింపులకు అందరూ లొంగరు'