కశ్మీర్లో విధించిన ఆంక్షలు తొలగించేందుకు భారత్ ముమ్మర చర్యలు చేపట్టాలని కోరింది అమెరికా. నిర్బంధంలో ఉన్న జమ్ముకశ్మీర్ రాజకీయ నేతలను విడుదల చేసే దిశగా మోదీ సర్కారు అడుగులేయాలని పేర్కొంది. ఇరుదేశాధినేతలతో ట్రంప్ ప్రత్యేక భేటీ అనంతరం.. అమెరికా విదేశాంగశాఖ దక్షిణాసియా వ్యవహారాల ప్రతినిధి అలీస్వెల్స్ ఈ ప్రకటన చేశారు. భారత ప్రభుత్వం చెప్పినట్లుగానే.. కశ్మీర్లో ఎన్నికలు వీలైనంత తొందరగా జరపాలని కోరారు.
"జమ్ముకశ్మీర్ ప్రజా జీవనంపై ఆంక్షలు, వ్యాపార వేత్తలు, రాజకీయ నాయకులను భారత ప్రభుత్వం అదుపులోకి తీసుకోవడంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. కశ్మీర్లో ఆంక్షలు ఎత్తివేతతో పాటు నిర్బంధంలో ఉన్న నేతల విడుదలకు భారత్ సత్వర చర్యలు తీసుకుంటుందని మేము భావిస్తున్నాం."
- అలీస్వెల్స్ , అమెరికా విదేశాంగశాఖ దక్షిణాసియా వ్యవహారాల ప్రతినిధి
ట్రంప్ సిద్ధంగా ఉన్నారు
కశ్మీర్ తమ అంతర్గత వ్యవహారమని మొదట్నుంచి భారత్ చెబుతూనే ఉంది. అయితే ఇరుదేశాలు కోరుకుంటే కశ్మీర్ అంశంపై ట్రంప్ మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు అలీస్.
గతనెలలో కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని మోదీ 2.0 ప్రభుత్వం రద్దు చేసింది. అనంతరం లోయలో ఎలాంటి అల్లర్లు చెలరేగకుండా ఉండేందుకు ఆంక్షలు విధించి.. స్థానిక రాజకీయనేతలను నిర్బంధంలోకి తీసుకున్నారు అధికారులు.