హిమగిరులు, నదుల పరవళ్లు, అంతకు మించిన ప్రకృతి సోయగాలు సొంతమైన 'జమ్ముకశ్మీర్' ఈ భూమండలానికే ఓ ప్రత్యేకం. అందుకే కశ్మీర్ను 'భూలోక స్వర్గం'గా అభివర్ణిస్తారు. ఇంతటి సుందర ప్రదేశం గత కొన్నేళ్లుగా గ్రెనేడ్ దాడులు, తుపాకుల శబ్ధంతో మార్మోగుతోంది. పాకిస్థాన్ ఆధారిత జైషే మహ్మద్, లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి తీవ్రవాద సంస్థలే ఇందుకు ప్రధాన కారణం. కశ్మీర్ లోయలో కల్లోలం సృష్టించేందుకు అలుపెరుగని ప్రయత్నాలు చేస్తున్న ఈ ముష్కర ముఠాలు.. భారత సైనిక చర్యలతో భంగపాటుకు గురవుతున్నాయి.
అందుకే ఈసారి 'పక్కా లోకల్' స్కెచ్తో గతేడాది డిసెంబరులో మరో ఎత్తుగడకు తెరలేపారు ముష్కరులు. లష్కరే తొయిబా అండతో 'ద రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)' అనే పేరున కొత్త ఉగ్రసంస్థను నెలకొల్పారు. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారంతో స్థానిక యువతకు ఎర వేస్తున్నారు. గతంలో జరిగిన కేరన్ ఎన్కౌంటర్ నుంచి ఇటీవలి హంద్వారా వరకు ప్రతిదీ తామే చేశామని ప్రకటించుకుంది టీఆర్ఎఫ్. ప్రస్తుతం ఈ ఉగ్రసంస్థ వల్లే కశ్మీర్ లోయలోని మన సైనికులు కంటిమీద కునుకు లేకుండా గస్తీ కాయాల్సి వస్తోంది.
కశ్మీర్లో భారత భద్రతా దళాలే లక్ష్యంగా తుపాకులకు పనిచెబుతున్న ఈ ఉగ్ర సంస్థకు సంబంధించి మరిన్ని అంశాలను ఫోన్ ద్వారా ఈటీవీ భారత్తో పంచుకున్నారు రక్షణ రంగ విశ్లేషకులు, రీసెర్చ్ అండ్ అనాలసిస్ విభాగం(రా) మాజీ సీనియర్ అధికారి జేకే వర్మ, కశ్మీర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు విజయ్ కుమార్. టీఆర్ఎఫ్ను కచ్చితంగా పాకిస్థానే స్థాపించిందని వెల్లడించారు.
" లష్కరే తొయిబా కీలక సభ్యులైన సజాత్ జత్ (దక్షిణ కశ్మీర్), ఖలీద్ (సెంట్రల్ కశ్మీర్), హంజాలా ఆద్నాన్(ఉత్తర కశ్మీర్)ల సాయంతో టీఆర్ఎఫ్ను కచ్చితంగా పాకిస్థానే నడిపిస్తోంది. భారత్పై వారి అజెండాలకు టీఆర్ఎఫ్ సాయంతో స్వదేశీ రంగు అద్దాలనుకుంటోంది. అంతర్జాతీయ సంస్థలు, ముఖ్యంగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) నుంచి వస్తున్న ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఈ విధంగా చేస్తోంది. టీఆర్ఎఫ్ పేరు కూడా పాక్ మనోభావాలకు అద్దం పడుతోంది.
కశ్మీర్లో గ్రెనేడ్ దాడి దగ్గర్నుంచి కాల్పుల వరకు ఏం జరిగినా తామే చేశామని బాధ్యత వహించేందుకు ముందుకొస్తోంది టీఆర్ఎఫ్. స్థానికులను ఆకర్షించేందుకు, వారి నుంచి తమకు మద్దతు కూడగట్టుకునేందుకు ఇలా చేస్తూ ఉండొచ్చు. ఇటీవల హంద్వారాలో జరిగిన ఎన్కౌంటర్ తర్వాత కూడా.. పాకిస్థాన్లోని టీఆర్ఎఫ్ నాయకులు ట్విట్టర్ వేదికగా ఏ విధంగా బాధ్యత వహించారో మనమందరం చూశాం. గతంలోనూ కేరన్ సెక్టార్లో జరిగిన ఎన్కౌంటర్కూ ఇలాగే బాధ్యత వహించారు."
- జేకే వర్మ, రక్షణ విశ్లేషకులు, రీసెర్చ్ అండ్ అనాలసిస్ విభాగం(రా) మాజీ సీనియర్ అధికారి
'టీఆర్ఎఫ్తో స్వదేశీ ఉద్యమ రంగు'
కశ్మీర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు విజయ్ కుమార్ కూడా ఈటీవీ భారత్తో మాట్లాడారు. టీఆర్ఎఫ్ కీలక నాయకులందరూ లష్కరే తొయిబాకు చెందినవారేనని వెల్లడించారు.
" ఓ కొత్త పేరుతో టీఆర్ఎఫ్ను లష్కరే తొయిబానే గతేడాది స్థాపించింది. ఈ ఉగ్రవాదులందరూ మా రికార్డుల్లో ఉన్నవారే. హంద్వారా ఎన్కౌంటర్లో మరణించిన ఇద్దరు ముష్కరుల్లో ఒకడు లష్కరే కమాండర్ హైదర్. హిజ్బుల్ ముజాహిద్దీన్ తీవ్రవాదులను కూడా కలుపుకుని టీఆర్ఎఫ్ మరింత విస్తరించాలని చూస్తోంది. కశ్మీరీలు స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నారని ప్రపంచాన్ని నమ్మించాలని చూస్తోంది. వాస్తవానికి అది జరగదు. ఎందుకంటే నిజమేంటో.. అందరికీ తెలుసు.
పోలీసులు టీఆర్ఎఫ్ టెలీగ్రామ్ ఖాతాను బ్లాక్ చేశారు. అందుకే రియాజ్ నైకూ మరణవార్తకు సంబంధించి తక్కువ అప్డేట్స్ మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం భద్రతా బలగాలపై గ్రెనేడ్ దాడి చేసేందుకు టీఆర్ఎఫ్ ప్రణాళికలు రచిస్తోంది."
- విజయ్ కుమార్, కశ్మీర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు
గతేడాది డిసెంబరులో...
గతేడాది ఆగస్టు 5న ఆర్టికల్ 370, 35ఏను కేంద్రం రద్దు చేసింది. ఆ తర్వాత నాలుగు నెలలకు డిసెంబరులో ఈ టీఆర్ఎఫ్ ఉగ్రసంస్థ పుట్టుకొచ్చింది. లష్కరే తొయిబా మాజీ నాయకుడు ఈ సంస్థను నడిపిస్తున్నాడని సైనిక నిఘా వర్గాలు చెబుతున్నాయి. టీఆర్ఎఫ్ మాత్రం లష్కరే తొయిబాతో తమకు ఎలాంటి సంబంధం లేదని బుకాయిస్తోంది.
ఇదీ చదవండి : కశ్మీర్పై పాక్ కొత్త కుట్రలు- తాలిబన్ల సాయంతో...