దేశంలో కరోనా ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షల విధానాన్ని మార్చాలని సూచిస్తున్నారు పరిశోధకులు. 130 కోట్ల మంది జనాభాలో ఇప్పటివరకు 9,02,654 మంది నమూనాలు మాత్రమే పరీక్షించారని, వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఈ సంఖ్య ఏమాత్రం సరిపోదని అభిప్రాయపడ్డారు. దేశంలో ఎంతమంది వైరస్ బారిన పడ్డారో తెలుసుకునేందుకు మురుగు నీటి పరీక్షలు(వేస్ట్వాటర్ ఎపిడెమియాలజీ) విధానాన్ని అనుసరించడమే మన ముందున్న మార్గమని స్పష్టం చేశారు. గతంలో పోలియో మహమ్మారి నియంత్రణకు ఈ తరహా పద్ధతినే అనుసరించినట్లు గుర్తు చేశారు.
ప్రస్తుత పరిస్థితులలో దేశంలో కరోనా ప్రభావం ఏ స్థాయిలో ఉందో అంచనాకు వచ్చేందుకు వేస్ట్ వాటర్ బేస్డ్ ఎపిడెమియాలజీ(డబ్ల్యూబీఈ) విలువైన సాధనమని చెప్పారు గాంధీనగర్లోని ఇండియన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)కి చెందిన పరిశోధకులు మనీశ్ కుమార్.
ప్రపంచ వ్యాప్తంగా 50 సంస్థలు అమెరికాలోని నోట్రీ డేమ్ యూనివర్సిటీకి చెందిన జేమ్స్ బిబ్బీ నేతృత్వంలో డబ్ల్యూబీఈకి సహకారం అందిస్తున్నాయి. నమూనాలు పరీక్షించి ఫలితాల విశ్లేషణలను అన్ని దేశాలు పంచుకుని ప్రపంచ స్థాయిలో పోల్చి చూస్తారు.
రోజుకు 49వేలు...
భారత వైద్య పరిశోధన మండలి వివరాల ప్రకారం ప్రస్తుతం దేశంలో సగటున రోజుకు 49,800 నమూనాలు పరీక్షిస్తున్నారు. గత ఎనిమిది రోజులలో టెస్టుల సంఖ్య రెట్టింపైంది. మార్చి 23 నుంచి ఏప్రిల్ 22 వరకు దేశంలో కేవలం 5,00,000 పరీక్షలే నిర్వహించారు.
భారత్లో కరోనా వ్యాప్తి కచ్చితమైన పరిస్థితిని చెప్పడానికి ప్రస్తుత పరీక్షా పద్ధతి సరిపోదని, వైరస్ లక్షణాలు చూపించినప్పటికీ గుర్తించడానికి వాస్తవానికి 3 నుంచి 15 రోజులు పడుతుందని భూ శాస్త్రాల విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ కుమార్ చెప్పారు. అందుకే మురుగునీటి పరీక్షలతో కరోనావైరస్ జన్యు పదార్థం ఉందో లేదో తనిఖీ చేయాలన్నారు. ఇదే పద్ధతిని ఉపయోగించే పోలియోను జయించామని, ఇప్పుడు కరోనా పోరాటంలోనూ ఉపయోగపడుతుందని వివరించారు.
మురుగునీటిలో కరోనా వైరస్ ప్రత్యక్షంగా ఉండనప్పటికీ దానిలోని ఆర్ఎన్ఏ(వైరస్లలోని జన్యు పదార్థం)ను గుర్తించవచ్చు. జన్యు పదార్థం ఎంత లభిస్తుందో అంచనా వేయవచ్చు. ఫలితాల ఆధారంగా ఎంతమందికి వైరస్ సోకిందో అంచనా వేయవచ్చని కుమార్ వివరించారు. ఒకే ప్రోటోకాల్ను ఉపయోగించి పరీక్షలు నిర్వహించాలని ఐఐటీ చెన్నై, ఐఐటీ రూర్కీ, ఐఐటీ గువహటి, దిల్లీ జెఎన్యూకు సూచించినట్లు పేర్కొన్నారు. తన పరిశోధనలకు గజరాత్ కాలుష్య నియంత్రణ మండలి సహకారం అందిస్తుందన్నారు.
మిలియన్ల సంఖ్యలో..
ఐరోపా, ఉత్తర అమెరికా సేకరించిన వివరాల ఆధారంగా గతంలో సార్స్ బారిన పడిన ప్రతి వ్యక్తి రోజుకు మిలియన్లు, బిలియన్ల సంఖ్యలో వైరస్ జన్యువులను మల, మూత్రాలలో విసర్జించవచ్చని సూచిస్తున్నాయి. లీటర్ వ్యర్థ జలాల్లో 0.15మిలియన్ల నుంచి 141.2 మిలియన్ వైరస్ జన్యువులు ఉండే అవకాశం ఉంది.