జమ్ము కశ్మీర్లో అలజడులు సృష్టించేందుకు ఉగ్రమూకలు రాష్ట్రంలో చొరబడ్డారని నిఘా వర్గాలు తెలిపాయి. ఒక్క కశ్మీర్లోనే 273 మంది ఉగ్రవాదులు నక్కి ఉన్నారని స్పష్టం చేశాయి. లోయలో హింస సృష్టించేందుకు వీరంతా పెద్ద ఎత్తున ప్రణాళికలు రచిస్తున్నట్టు వెల్లడించాయి.
వేర్వేరు ఉగ్ర సంస్థలకు చెందిన ముష్కరులు.. రానున్న రోజుల్లో పేలుళ్లు జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. దక్షిణ కశ్మీర్లో 158 మంది, ఉత్తర కశ్మీర్లో 96, కశ్మీర్ మధ్య ప్రాంతంలో 19 మంది ఉగ్రవాదులను గుర్తించినట్లు నిఘా వర్గాలు తమకు వెల్లడించాయని ఓ జాతీయ వార్తా సంస్థ తెలిపింది.
వివిధ ఉగ్రసంస్థల నుంచి..
వీరిలో 166 మంది స్థానికులుకాగా, మరో 107 మంది విదేశీయులుగా గుర్తించారు అధికారులు. పాకిస్థాన్కు చెందిన లష్కరే తొయిబా ఉగ్ర సంస్థకు చెందినవారే 112 మంది ఉన్నారు. మరో 100 మంది హిజ్బుల్ ముజాహిదీన్, 59 మంది జైషే మహ్మద్, ముగ్గురు ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్ అయిన అల్-బదర్కు చెందినవారు ఉన్నారని నిఘావర్గాలు గుర్తించారు.
జమ్ము కశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేశాక ఆ ప్రాంతంలో అలజడులు సృష్టించేందుకు పాకిస్థాన్ కుయుక్తులు పన్నుతోంది. ఇప్పటికే నియంత్రణ రేఖ వెంబడి 30 ఉగ్రవాద శిబిరాలను కూడా ఏర్పాటు చేసినట్లు కొద్ది రోజుల క్రితం భారత నిఘా వర్గాలు గుర్తించాయి. పాక్కు చెందిన ఆర్మీ, ఐఎస్ఐ సంస్థలు ఇతర ప్రాంతాల నుంచి ఉగ్రవాదులను ఈ శిబిరాలకు తరలిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
ఇదీ చూడండి: 'ఆప్యాయతతో కశ్మీర్లో సరికొత్త స్వర్గాన్ని సృష్టించాలి'