కరోనా వైరస్పై పోరులో భాగంగా దేశవ్యాప్తంగా అనేక మంది తమవంతు విరాళాలు ఇస్తున్నారు. అయితే కేరళకు చెందిన సుబైదా.. తనకున్న కష్టాలను లెక్కచేయకుండా విరాళం అందించి మానవత్వాన్ని చాటుకుంది. ఇందుకోసం తన రెండు మేకలను అమ్మేసింది.
ఎన్ని కష్టాలున్నా...
కొల్లమ్ పోర్టు కార్యాలయం సమీపంలో టీ కొట్టు నడుపుతోంది సుబైదా. అదే ఆమెకు జీవనోపాధి. రోజూ టీవీలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మీడియా సమావేశాన్ని చూస్తుంది. కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా నెలకొన్న క్లిష్ట పరిస్థితులు సుబైదాను ఎంతో బాధపెట్టాయి. దేశానికి ఎలాగైనా సేవ చేయాలని.. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని ఆలోచించింది. కానీ తన టీ దుకాణంపైనా లాక్డౌన్ ప్రభావం పడింది. దీంతో ఆదాయం లేకపోవడం వల్ల చివరకు తన వద్ద ఉన్న రెండు మేకలను అమ్మేసింది సుబైదా. వాటితో ఆమెకు 12వేల రూపాయలు వచ్చాయి. అందులో రూ. 5,510ను సీఏం సహాయనిధికి విరాళంగా ఇచ్చింది. కొల్లమ్ జిల్లా కలెక్టర్ బీ అబ్దుల్ నాజర్కు ఈ మొత్తాన్ని అందించింది.
భర్త అబ్దుల్ సాలమ్, తమ్ముడితో కలిసి కొల్లమ్లోని ఓ అద్దె ఇంట్లో నివసిస్తోంది సుబైదా. అబ్దుల్, సోదరుడికి హృద్రోగ సమస్యలున్నాయి. సుబైదా భర్తకు ఇప్పటికే ఓసారి సర్జరీ అయింది. ఆమెకు ముగ్గురు సంతానం. వారందరికి పెళ్లిళ్లు చేసేసింది. మేకలను అమ్మి సీఎం సహాయనిధికి విరాళాలు ఇవ్వాలన్న సుబైదా నిర్ణయాన్ని భర్త ఎంతగానో ప్రోత్సహించాడు.
విరాళం ఇవ్వగా మిగిలిన నగదులోని కొంత మొత్తాన్ని ఇంటి అద్దెకు, విద్యుత్ బిల్లులకు వినియోగించింది సుబైదా. తన మేకలను అమ్మి విరాళం ఇవ్వడం తనకు బాధగా లేదని తెలిపిన సుబైదా.. విరాళం ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:- నాగాల రక్తంపై చైనా పరిశోధనల వల్లే కరోనా?