రాజ్యసభ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్లో 'లేఖ' వ్యవహారంపై అంతర్గత యుద్ధం జరిగిన కొద్ది రోజులకే.. దీనిపై ఊహాగానాలు జోరందుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
రాజ్యసభలో ఆజాద్ పదవీకాలం 2021 ఫిబ్రవరి 15తో ముగియనుంది. పెద్దల సభకు ఆజాద్ మరోమారు ఎన్నికవ్వడం దాదాపు అసాధ్యమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
అయితే పుదుచ్చెరిలో సీటు మాత్రమే ఆజాద్కు ఉన్న ఏకైక అవకాశంగా కనపడుతోంది. ప్రస్తుతం అన్నాడీఎంకే ఎంపీ ఎన్ గోపాలకృష్ణన్ ఉన్న ఆ స్థానం 2021అక్టోబర్లో ఖాళీ కానుంది. ఇందులోను ఇంకో చిక్కు ఉంది. వచ్చే ఏడాది మేలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందులో గెలిచి కాంగ్రెస్ తిరిగి అధికారం చేపడితేనే ఆ సీటు ఆజాద్ను వరిస్తుంది.
ఇదీ చూడండి:- 'కాంగ్రెస్ వాదులైతే లేఖను స్వాగతిస్తారు'
ఇది జరగకపోతే.. 2022మార్చిలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల వరకు ఆజాద్ పెద్దల సభ మెట్లు ఎక్కలేకపోవచ్చు.
జమ్ముకశ్మీర్లో ఈసారి కష్టమే...!
జమ్ముకశ్మీర్ నుంచి ఆజాద్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2019లో కేంద్రం జమ్ముకశ్మీర్ను కేంద్ర పాలితప్రాంతంగా విభజించింది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీనిచ్చారు. కానీ 2021మార్చి వరకు అది సాధ్యపడేలా కనపడటం లేదు.
2015లో నేషనల్ కాన్ఫరెన్స్ చట్టసభ్యుల మద్దతుతో పెద్దల సభకు చేరారు ఆజాద్. కానీ ఈసారి వారి నుంచి మద్దతు లభించడం ప్రశ్నార్థకమే.
ఇతర రాష్ట్రాల్లోనూ...
ప్రస్తుతం పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయితే ఇక్కడ ఇప్పటికే రాజ్యసభ ఎన్నికలు జరిగిపోయాయి.
కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్లో ప్రతిపక్షంలో ఉంది కాంగ్రెస్. ఇక్కడ కాంగ్రెస్ చట్టసభ్యులు సరిపడా ఉన్నప్పటికీ.. ఈ రాష్ట్రాల్లో కూడా రాజ్యసభ ఎన్నికలు జరిగిపోయాయి.
మరోవైపు శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ పాలిస్తున్న మహారాష్ట్రలోనూ పెద్దల సభకు ఎన్నికలు అయిపోయాయి.
కాంగ్రెస్లో కలకలం సృష్టించిన లేఖ వ్యవహారంలో ఆజాద్ పేరు వినిపించడానికి.. ఆయన పెద్దల సభకు తిరిగి చేరలేరన్న ఊహాగానాలకు సంబంధం లేనప్పటికీ... ఉన్న ఆప్షన్లను పరిశీలిస్తే.. ఆజాద్కు ఈసారి సీటు దక్కడం కష్టమేనని పార్టీ అంతర్గత వర్గాలు చెప్పుకుంటున్నాయి.
ఆ పదవిని అందుకునేదెవరు?
రాజ్యసభలో ఆజాద్ ప్రస్తుతం ప్రతిపక్ష సభాపక్ష నేతగా ఉన్నారు. ఆయన పదవీకాలం ముగిస్తే.. ఆ బాధ్యతను ఎవరు చేపడతారనే చర్చ కూడా మొదలైంది. నిజానికి సీనియారిటీ ప్రకారం ఇది ఆనంద్ శర్మకు చేరాలి. కానీ 'లేఖ' రాసిన వారిలో ఆయనకూడా ఉండటం వల్ల ఆనంద్కు అవకాశాలు తక్కువని పార్టీ అంతర్గత వ్యక్తులు చెబుతున్నారు. సోనియా విధేయుడు మల్లిఖార్జున ఖర్గేకు ఈ బాధ్యతలు చేరే అవకాశముందని వారు భావిస్తున్నారు.
ఇదీ చూడండి:- నాయకత్వ సంక్షోభం.. దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్