ఉత్తర భారతాన్ని మంచు దుప్పటి కప్పేసింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్ముకశ్మీర్ రాష్ట్రాలు హిమపాతంతో తడిసి ముద్దవుతున్నాయి. భారీగా కురుస్తున్న మంచు వర్షంతో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. రహదారులపై హిమం భారీగా పేరుకుపోవడం వల్ల... వాహనాల రాకపోకలు స్తంభించాయి. బయట గడ్డ కట్టే పరిస్థితుల ఏర్పడడం వల్ల దుకాణాలు మూతపడ్డాయి. స్థానికులు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి.
శ్వేత వర్ణం
వర్షాన్ని తలపించేలా కురుస్తున్న మంచుతో ఉత్తరాది రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలు శ్వేత వర్ణాన్ని సంతరించుకున్నాయి. జమ్మూకశ్మీర్, శ్రీనగర్, గురేజ్ సెక్టార్, వైష్ణో దేవి ఆలయం సహా.. ప్రసిద్ధ పర్యటక ప్రాంతాలన్నీ ధవళ వర్ణంతో తలతలలాడుతున్నాయి.
ఈ ప్రాంతాల్లో భారీగా
జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో హిమపాతం భారీగా కురుస్తోంది. జమ్మూలోని రాంబన్, ఉదంపూర్, బదర్వా, దోడా, కిష్టవార్, పూంచ్, రాజౌరి, రియాసి, కథువా జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
హిమచల్ ప్రదేశ్
హిమచల్ప్రదేశ్లోని పర్యటక పర్వత ప్రాంతాలైన సిమ్లా, మనాలి, డల్హౌసి, కుఫ్రీలో రాత్రికి రాత్రే ఒక్కసారిగా ఎడతెరిపి లేకుండా భారీగా మంచు వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. డల్హౌసిలో అత్యంత ఎక్కువుగా 60సెంటీమీటర్ల మంచు వర్షపాతం నమోదైంది. కుఫ్రీ(20), మనాలీ(10), సిమ్లా(8)సెంటీమీటర్ల మేర నమోదైంది.
ఇదీ చూడండి : హిమగిరులతో సిమ్లా హోయలు.. ఆనందంలో పర్యటకులు