వాట్సప్ ద్వారా పాత్రికేయులు, మానవహక్కుల కార్యకర్తల సమాచారం చోరీకి గురైన వ్యవహారంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది కాంగ్రెస్. అక్రమ స్పైవేర్ను ఎవరు కొనుగోలు చేశారు? ఎవరు వినియోగించారు? వంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు నిజాయతీ లేని ప్రభుత్వం నిరాకరిస్తోందని ఆరోపించింది.
సమాచార భద్రతకు సంబంధించిన సమస్యను మే నెలలో వాట్సాప్ పరిష్కరించి... ఆ సంస్థ విషయాన్ని భారత, అంతర్జాతీయ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా.
" వాట్సాప్ స్పైగేట్కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానమివ్వటానికి ఒక నిజాయతీ లేని ప్రభుత్వం నిరాకరిస్తోంది. ఆ ప్రశ్నలు 1. భారత ప్రభుత్వంలో ఎవరు అక్రమ స్పైవేర్ను కొనుగోలు చేసి వినియోగించారు? 2. ఎవరు దాని కొనుగోలుకు అధికారం ఇచ్చారు? 3. 2019, మేలోనే భారత ప్రభుత్వానికి ఫేస్బుక్ సమాచారం అందిస్తే.. ఎందుకు చర్యలు చేపట్టలేదు? 4.దోషులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? "
- రణ్దీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి.
ఇజ్రాయెల్ స్పైవేర్..
ఇజ్రాయెల్కు చెందిన 'పెగసస్' అనే హానికర స్పైవేర్తో భారత్లోని కొందరు పాత్రికేయులు, మానవ హక్కుల కార్యకర్తలు సహా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,400 మంది ఫోన్లలోని సమాచారాన్ని చోరీ చేశారని వాట్సాప్ ప్రకటించింది. టొరంటో విశ్వవిద్యాలయంలోని 'సిటిజన్ ల్యాబ్' అనే సైబర్ భద్రత ప్రయోగశాల సాయంతో ఈ దాడిని గుర్తించి, ఈ ఏడాది మేలోనే అడ్డుకున్నామని తెలిపింది.
దేశ పౌరుల సమాచార గోప్యతపై జరిగిన ఉల్లంఘనలకు వివరణ ఇవ్వాలని వాట్సప్ను ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం. ఈనెల 4లోపు కోట్లాది మంది భారతీయుల వ్యక్తిగత సమాచార గోప్యత పరిరక్షణకు తీసుకున్న చర్యలపై నివేదించాలని కోరింది.
ఇదీ చూడండి: 'వర్షంలో తడిస్తేనే రాజకీయంలో మంచి భవిష్యత్తు'