ఈ ఏడాది మైసూర్ దసరా ఉత్సవాలను ప్రారంభించాల్సిందిగా ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధును ఆహ్వానించారు కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప. ఒక క్రీడాకారిణిగా ప్రపంచస్థాయిలో మన దేశం గర్వపడేలా చేసిందని కొనియాడారు. ఎంతో మంది యువతీయువకులకు సింధు స్ఫూర్తిగా నిలవగలదని ఆమెకు పంపిన ఆహ్వాన లేఖలో పేర్కొన్నారు.
![Sindhu-Dasara](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4398366_lf.jpg)
"నువ్వు సాధించిన విజయాలు అద్వితీయం. ఎంతో మంది యువతీయువకులు తమ లక్ష్యాలను చేరుకునేలా నువ్వు స్ఫూర్తి ఇవ్వగలవు. నీలో ఉన్న విజేతను ఈ విధంగా సత్కరించడం మా గౌరవంగా భావిస్తున్నాం. నీ రాకతో ఈ ఉత్సవాలకు మరింత విలువ చేకూర్చాలని ఆశిస్తున్నాం. అందుకే 'రాష్ట్ర అతిథి'గా వచ్చి అక్టోబర్ 1న మొదలయ్యే 'యువ దసరా-2019 ఉత్సవాల'ను ప్రారంభించాల్సిందిగా ఆహ్వానం అందిస్తున్నాం."
- బీఎస్ యడియూరప్ప, కర్ణాటక ముఖ్యమంత్రి
తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు
కర్ణాటక ప్రభుత్వం జరిపే మైసూరు దసరా ఉత్సవాలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. ఈ సంబరాలు చూసేందుకు దేశ, విదేశాల నుంచి లక్షల సంఖ్యలో ప్రజలు తరలివస్తారు. కర్ణాటక సంప్రదాయం, సంస్కృతి, కళలకు నిదర్శనంగా తొమ్మిది రోజులు పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఏడాది జరగనున్న ఉత్సవాలు 410వ సంవత్సరం జరుగుతున్నవిగా కన్నడ ప్రభుత్వం తెలిపింది. ఈ సంబరాలు వీక్షించేందుకు వివిధ రంగాలకు చెందిన ఉన్నతాధికారులు, వ్యక్తులు హాజరవనున్నారని ప్రకటించింది.